Oct 11,2023 12:54

పాండిచ్చేరి (తమిళనాడు) : పాండిచ్చేరి ప్రభుత్వంలోని ఏకైక మహిళా ఎమ్మెల్యే, మంత్రి చంద్ర ప్రియాంక బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్‌ఛార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రికి రంగస్వామికి లేఖ పంపారు. కాగా, లేఖలో ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. ఎఐఎన్‌ఆర్‌సి-బిజెపి సంకీర్ణంలో నడుస్తున్న ప్రభుత్వంలో కుల వివక్ష, లింగ వివక్ష, కుట్ర రాజకీయాలు, ధనబలాన్ని తట్టుకోలేక తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ప్రజల మద్దతు లేకపోయినా ధన బలమున్న వారికి ఈ పదవి ఇచ్చి ద్రోహం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అభ్యర్థించారు. ఇక, ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నిరాకరించారు. ప్రియాంక రాజీనామాపై అడిగేందుకు ఆయన ఛాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 40 ఏండ్ల తర్వాత ప్రియాంక మొదటిసారి 2021లో మహిళా మంత్రిగా స్థానం పొందారు. అప్పట్లో ఆమె ఎన్‌.రంగస్వామి నేతఅత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. కరైకల్‌లోని నెదున్‌కాడు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు.