Jul 21,2023 17:45

హైదరాబాద్‌ : గత మూడు రోజుల నుంచి హైదరాబాద్‌ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్‌ సాగర్‌ నిండు కుండలా మారింది. హుస్సేన్‌ సాగర్‌ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ దాటింది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా, ప్రస్తుతం 514.75 మీటర్లు దాటింది. దీంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.రాబోయే 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప.. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదులకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ లైన్‌ నంబర్లు 040 - 21111111, 9000113667.ఏర్పాటు చేసింది.