Jul 25,2023 21:02

జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2018 ఎన్నికల్లో వనమా సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌కు ఉద్దేశపూర్వకంగా తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని వనమాకు న్యాయస్థానం రూ.5 లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో వనమా వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అప్పటి ప్రత్యర్థి జలగం వెంకట్రావు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 125 ఎ కింద 2019 జనవరిలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి తుది తీర్పు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరుపున వనమా వెంకటేశ్వరరావు, టిఆర్‌ఎస్‌ తరుపున జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో గెలిచిన వనమా ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు.