Sep 30,2023 07:08

అయితే పంటల ఉత్పత్తుల పంపకంలో ప్రభుత్వాలు తగిన ప్రణాళికను ఆచరించలేదు. ఫలితంగా పౌరులందరికీ ''ఆహార భద్రత'' విస్తరించలేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ (యు.ఎన్‌.ఒ) తన ఆహార వ్యవసాయ విభాగం (ఎఫ్‌.ఎ.ఒ) ద్వారా గుర్తు చేస్తూ వచ్చింది. స్వామినాథన్‌ వంటి వ్యవసాయ రంగ నిపుణులు కూడా పదే పదే ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు. ''సహస్రాబ్ది (మిలీనియం) అభివృద్ధి లక్ష్యాల'' ప్రకటన ద్వారా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ''జీరో హంగర్‌'' (ఆకలి లేని దశ) గమ్యాన్ని సూచించారు. పార్లమెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడిగా కూడా స్వామినాధన్‌ ప్రభుత్వానికి ఆ విషయాన్ని నివేదించారు. దాని ఫలితంగానే 2013లో భారతదేశ ''ఆహార భద్రతా చట్టం'' ఆచరణలోకి వచ్చింది. అలాగే ఉపాధి హామీ చట్టం ద్వారా ''ఆహారం'' హక్కుగా పరిగణించబడింది.

          భారతదేశాన్ని ''జీరో హంగర్‌'' స్థాయికి చేర్చాలని జీవితాంతం కృషి చేసిన ప్రొ.ఎం.ఎస్‌.స్వామినాధన్‌ మొన్న (సెప్టెంబర్‌ 28) చెన్నైలో మరణించారు. పరిపూర్ణ ప్రయోజనకర జీవితాన్ని గడిపిన ఈ ప్రజా శాస్త్రవేత్తను ముందు తరాలు ఏమాత్రం విస్మరించజాలవు. ఆయన కృషి, శాస్త్రీయ అవగాహన ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రొ.స్వామినాథన్‌ అనేక పురస్కారాలను, యూనివర్సిటీ డాక్టరేట్లను, అనేక దేశాల వ్యవసాయ అకాడమీల సలహాదారు హోదాను పొందటం ఒక ఎత్తైతే...జాతీయ రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా రైతు వ్యవసాయ రక్షణ లక్ష్యంతో ప్రభుత్వం ముందు పెట్టిన ఐదు నివేదికలు మరో ఎత్తు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా మహిళా రైతుల హక్కులపై చేసిన ప్రసంగం విలువైందిగా పరిగణించే స్థాయి మన ప్రభుత్వాలకు వుండాలి! అనేకమంది సామాజిక ఆర్థిక నిపుణుల సలహాల నేపథ్యంతో జాతీయ రైతు కమిషన్‌ ద్వారా తాను ప్రభుత్వం ముందుంచిన సంస్కరణలు ఆచరణ రూపుదాలుస్తాయని ఆశించారు. 2017లో ప్రొ.స్వామినాథన్‌ పరిశోధనా సంస్థ 'అఖిల భారత కిసాన్‌ సభ' ముఖ్య కార్యదర్శి హన్నన్‌ మొల్లా సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ అభిప్రాయాలను వెల్లడించారు. అనేక సందర్భాల్లో తాను ఆశించిన వ్యవసాయ రంగ మార్పుల్ని, ప్రభుత్వ పాత్రను, కుటుంబ (రైతు) వ్యవసాయ రక్షణ ఆవశ్యకతల్నీ మీడియా ముందు చర్చించారు. అనేక వ్యాసాలు రాశారు, పుస్తకాలు రచించారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సహకారంతో అనేక అంతర్జాతీయ చర్చా వేదికలను నిర్వహించి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయ ప్రణాళికల్ని సూచించారు. తన సంస్థ పరిశోధనా పరిధిని క్రమేణా విస్తరిస్తూ వచ్చారు. తమిళనాడుతో పాటు ఒడిషా, కేరళ, అంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని స్థానిక వ్యవసాయ సమస్యలపై అధ్యయనాలు జరిపారు.
           స్వయంపాలన మొదలైన రెండు దశాబ్దాల్లో ఆహార పరంగా స్వయం సమృద్ధి గాడిలో పడటం మొదలైంది. మరో దశాబ్ద ప్రణాళికల వల్ల తిండిగింజల ఉత్పత్తిలో దేశం నిలబడగలిగింది. అలీనోద్యమ వరవడికి చోదకశక్తిగా భారతదేశం రూపొందింది. దీని వెనుక ఆనాటి రాజకీయ నాయకత్వం-జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ, సుబ్రమణ్యం-రిచారియా, యం.వి.రావు, గంగాప్రసాదరావు, ప్రధాన్‌, స్వామినాధన్‌ వంటి శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగాన్ని మార్చగలిగింది. దాన్నే విలియం గాడ్‌, నార్మన్‌ బోర్లాగ్‌ వంటి వారు ''హరిత విప్లవం'' అన్నారు. గోధుమ, వరి, మొక్కజొన్న, జొన్న వంటి ముఖ్య ఆహార పంటల ఉత్పత్తి దేశాన్ని మలుపు తిప్పింది. స్వామినాధన్‌కు మొదటి ''ప్రపంచ ఆహార పురస్కారం'' (వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌) వంటివి అందించింది. ఆహార రంగ వివిధ శాఖలు విస్తరించి, దేశ వ్యవసాయ పరిశోధనా రంగాల నిలయంగా మార్చబడింది. 21వ శతాబ్దం నాటికి 300 మిలియన్‌ టన్నుల తిండిగింజల్ని ఉత్పత్తి చేయించగలిగింది.
          అయితే పంటల ఉత్పత్తుల పంపకంలో ప్రభుత్వాలు తగిన ప్రణాళికను ఆచరించలేదు. ఫలితంగా పౌరులందరికీ ''ఆహార భద్రత'' విస్తరించలేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ (యు.ఎన్‌.ఒ) తన ఆహార వ్యవసాయ విభాగం (ఎఫ్‌.ఎ.ఒ) ద్వారా గుర్తు చేస్తూ వచ్చింది. స్వామినాధన్‌ వంటి వ్యవసాయ రంగ నిపుణులు కూడా పదే పదే ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు. ''సహస్రాబ్ది (మిలీనియం) అభివృద్ధి లక్ష్యాల'' ప్రకటన ద్వారా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ''జీరో హంగర్‌'' (ఆకలి లేని దశ) గమ్యాన్ని సూచించారు. పార్లమెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడిగా కూడా స్వామినాధన్‌ ప్రభుత్వానికి ఆ విషయాన్ని నివేదించారు. దాని ఫలితంగానే 2013లో భారతదేశ ''ఆహార భద్రతా చట్టం'' ఆచరణలోకి వచ్చింది. అలాగే ఉపాధి హామీ చట్టం ద్వారా ''ఆహారం'' హక్కుగా పరిగణించబడింది.
            ప్రజా పంపిణీ వ్యవస్థ కీలకమైన ప్రభుత్వ నిర్వహణ బాధ్యతగా మార్చబడింది. అయితే పౌష్టికాహార లభ్యత పరంగా భారతదేశం ఇంకా వెనక బడే ఉందని గణాంకాలు సూచిస్తూనే ఉన్నాయి. దేశంలో తగినంతమంది (18 శాతం) ఇంకా ఆహారం అందని స్థాయిలో ఉన్నట్లు తేలింది. కారణాలేమిటనేది చర్చించాల్సిన అంశం.
           ఆహార సంక్షోభ పరంగా ప్రపంచ నివేదిక-2022 ప్రకారం, దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఆహారం అందనంత దూరంగానే వుంది. ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొన్న ''కరోనా'' దాడి తరువాతి దశలో కూడా ఆకలికి గురౌ తున్న వారి సంఖ్య పెరుగుతోందని గణాంకాలు సూచిస్తున్నాయి. దానికి కారణం ప్రపంచాన్ని ఆవహించిన ఆర్ధిక సంక్షోభం. ఫలితంగా అందకుం డాపోతున్న ఆహార ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వాతావరణ సంక్షోభ వరవడి వంటివి ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు ఉక్రెయిన్‌ యుద్ధం, ఆకలి చావుల్ని పెంచింది. ఆహార కొరతను ఎదుర్కొంటున్న జనాభా గణాంకాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. ఇందులో భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ కూడా ఉండటం గమనంలో ఉంచుకోవాలి.
 

                                                          స్వామినాథన్‌ సూచించిన ముఖ్య పరిష్కారాలు

ఆహార భద్రత నిర్వచనం ప్రకారం, ప్రజలందరికీ భౌతికంగా, ఆర్థికంగా తగినంత ప్రమాణంలో పౌష్టికాహారం అందాలి. అంటే పౌరుడు ఆరోగ్యకరంగా, విధి నిర్వహణ పరంగా ప్రయోజనం పొందాలి. ఆహార భద్రత చట్టం చేసిన భారతదేశంలో కూడా ఇది సాధ్యపడలేదనే చెప్పుకోవాలి. సరైన ఆహార లభ్యత ఉన్న దేశంలో పిల్లల పెరుగుదల, స్త్రీల రక్త పుష్టి, పౌరులందరి మానసిక శారీరక దారుఢ్యం సరిగ్గా ఉంటుందని కొన్ని ఐరోపా దేశాల గణాంకాలు సూచిస్తున్నాయి. కాని, భారత్‌ వంటి దేశాల్లో ఇంకా పిల్లల ఎదుగుదల సరిగ్గా లేక, స్త్రీల రక్తహీనత బయటపడుతూనే ఉన్నదని తేలింది. అదేవిధంగా పౌష్టికాహార లోపాలు పెరిగి ఊబకాయుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
          ఈ వరవడి 2030 నాటికి మన దేశ జనాభాలో ఆరోగ్య సమస్యల వలయంలో చిక్కుకునే వారి సంఖ్య పెరుగుతుందని అర్ధమౌతున్నది. దీని వెనుక, ఆర్థికపరమైన అంతరాలు, లింగపరమైన అసమానతలు, పట్టణ, పల్లె జీవన విధానాల్లో రూపొందిన తేడాలు, పాలనా రంగ వైఫల్యాలు ముఖ్యమైనవని తెలుస్తున్నది. అందుకే...

1. ఆహార అభద్రతా వలయంలో చిక్కుకొన్న వర్గాల్ని స్పష్టంగా గుర్తించాలి. 2. ఆ ప్రజల సాంప్రదాయ అలవాట్లకు తగిన పౌష్టికాహారాన్ని అందించగల పథకాల్ని ప్రభుత్వం అమలు పరచాలి. 3.పౌష్టికాహార మూల పదార్థాలైన మాంసకృతులు, కొవ్వు, ఖనిజ లవణాలున్న వాటిని తగిన స్థాయిలో అందించే ప్రణాళికలకు ప్రాముఖ్యతనివ్వాలి. 4. అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా, స్థానిక సంస్థల పాత్రను పెంచాలి. ఆహార పంపిణీ వ్యవస్థ బలపడాలి. 5. ఆరగించిన ఆహారం శరీరానికి వంటబట్టే పరిసరాలను పౌరులకు కల్పించాలి. ముఖ్యంగా మలినాలు లేని నీళ్లు అందుబాటులోకి తేవాలి. విష వాయువులు విస్తరించని పరిసరాలు కల్పించబడాలి. 6. వీధి బండ్లలో విక్రయించే ఆహార పదార్థాల ప్రమాణాలపై నిరంతర నియంత్రణా వ్యవస్థల ద్వారా నిఘా ఉంచాలి. 7. పౌష్టికాహార లభ్యత లక్ష్యాన్ని అందుకొన్న ప్రభుత్వాలకే ప్రపంచ ద్రవ్య సహకార సంస్థలు ఆర్థిక సహాయం అందించాలి. 8.ఆహార ధరల హెచ్చుతగ్గులకు కీలకమైన ''మార్కెట్‌ వ్యవస్థను'' అదుపులో ఉంచాలి. 9. ఆహార ఉత్పాదనకు (ఉదాహరణకు వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు) కావాల్సిన ఉపకరణాల్ని అందుబాటు ధరల్లో లభింపజేయడం ముఖ్య బాధ్యతగా భావించాలి. 10. పౌర సమాజాన్ని ఆహార భద్రతలో ఉంచగల విద్య, విస్తరణ సంస్థల్ని పున:నిర్మించటం తక్షణ కర్తవ్యంగా గుర్తించాలి.

''జీరో హంగర్‌'' నినాదంతోనూ, ''ఆహార భద్రత చట్టం''తోనూ పౌరుల్ని మభ్యపెట్టే ధోరణి విడనాడి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింపచేయాలి. ఆధునిక సాంకేతికాల సహకారంతో ''ఫుడ్‌ ఫోర్టిఫికేషన్‌'' (పౌష్టికాహార రూపకల్పన) చేసి అందరికీ అందుబాటులోకి తేవాలి. కేవలం ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ అనే నినాదాలతో సమస్య పరిష్కారం కాదు. ఆవు ద్వారా లభించే ప్రయోజనాన్ని అతిగా పరిగణించి మిగిలిన పాడి, మాంస జంతువులను అలక్ష్యం చేసే పరిస్థితి ఉండకూడదు.

స్వామినాధన్‌ను హరిత విప్లవ పితామహుడని ఎవరైనా సంబోధిస్తే... తాను కేవలం ముగ్గురు ప్రయోజకులైన అమ్మాయిలకు తండ్రిని మాత్రమేనని నవ్వేవారు. పరిశోధనా సంస్థలోని యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిని, శాస్త్రీయ అవగాహనను పెంచే నిమిత్తం తరుచుగా సెమినార్లను నిర్వహించేవారు. హరిత విప్లవం పేరుతో జరుగుతున్న వనరుల పతనాన్ని పదే పదే గుర్తుచేసేవారు. తాను 1968 సైన్స్‌ కాంగ్రెస్‌ నుండి ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి, పౌరుల దృష్టికి తెస్తున్నట్లు వివరించేవారు. అయినా ప్రకృతి వ్యవ సాయం, శూన్య పెట్టుబడి పంటల సాగు ప్రచారకులు కొందరు స్వామినాధన్‌ సాంకేతికాల వరవడి నష్టం చేసిందన్నారు. అలానే కృత్రిమ జన్యుమార్పిడి విత్తనాల విషయంలో స్వామినాధన్‌ మాన్సెంటో వంటి కంపెనీల పాత్రను ఎత్తిచూపలేదన్నారు. కాని నియంత్రణ, నిఘా పాత్రల్ని ప్రభుత్వాలు నిర్వహించాలని స్వామినాధన్‌ తరచుగా చెప్పేవారు. అలాగే కొత్త సాంకేతికాల్ని పదే పదే పరిశీలించకుండా, బేరీజు వేసుకోకుండా వ్యవసాయంలో ప్రవేశపెట్టడం అనర్ధమని చెప్పేవారు. వ్యవసాయాన్ని దేశ స్వావలంబనకు పునాదిగా (ఆహార రంగం) మార్చిన ముఖ్య శాస్త్రవేత్త స్వామినాధన్‌.

వ్యవసాయ రంగ ఉద్ధరణలో మత్స్య, కోడి, గొర్రెల పెంపకాల్ని విస్తరింపచేయాలి. వాటి ఉత్పత్తిదారులకు అనుకూల సహకారాన్ని అందించాలి. 2017-2021 భారతదేశ రైతు ఉద్యమాలు దేశ ఆహార భద్రతకు మేల్కొలుపుగా భావించి ఆహార ఉత్పత్తిదారుల, వినియోగదారుల మధ్య సమన్వయం కల్పించాలి. అప్పుడే ''ఆహార హక్కు'' చట్టానికి అర్ధముంటుంది. ప్రొ.స్వామినాధన్‌ కృషికి సార్ధకత, నిజమైన నివాళి అవుతుంది.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9490098905 /

ప్రొ.ఎన్‌. వేణుగోపాలరావు