మెట్పల్లి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. జగిత్యాల జిల్లాలో మెట్పల్లిలో మీడియాతో ఆమె మాట్లాడారు. గాంధీ కుటుంబానికి తెలంగాణకు మధ్య విద్రోహక సంబంధం ఉందన్నారు. సీఎం కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణ ప్రకటించారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు. సింగరేణి కార్మికులకు బిఆర్ఎస్ హయాంలోనే న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు పనికొచ్చే విధంగా ఉందన్నారు. ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్లో చనిపోయిన వారికీ ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని కవిత స్పష్టం చేశారు.










