- ఇంకా 5 జిల్లాలు, 208 మండలాల్లో తక్కువ వర్షం
- ఖరీఫ్ సాగు అంతంతే
- జులై నాటికి కావాల్సిన సాగులో 16.7 లక్షల ఎకరాలు మైనస్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఎట్టకేలకు ఈ ఖరీఫ్లో ఇప్పటికి రాష్ట్రం సగటు సాధారణ వర్షపాత స్థితికొచ్చింది. ఇంకా నాలుగు జిల్లాల్లో, 208 మండలాల్లో తక్కువ వర్షమే ఉంది. జులై మూడవ వారం వరకు 16 జిల్లాల్లో, 379 మండలాల్లో తక్కువ వర్షం నమోదుకాగా, జులై నాల్గవ వారంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం వర్షాభావం నుంచి తెప్పరిల్లింది. జూన్ 1 నుంచి జులై 27 వరకు ఎపి సగటు సాధారణ వర్షపాతం 239.4 మిల్లీమీటర్లు కాగా 239 మిమీ నమోదైంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో ఇంకా వర్షపు లోటు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఎడతెరిపిలేని భారీ వర్షాలకు అక్కడక్కడ పంటలు దెబ్బతిన్నప్పటికీ, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగినప్పటికీ మొత్తంగా సేద్యానికి ఊతమిచ్చాయి. కాగా రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో అదను తప్పాక పదును అన్నట్లుంది పరిస్థితి. ప్రధానంగా వేరుశనగ పంట తొలకరి వానలకు జూన్, జులైలో ముమ్మరంగా సాగవుతుంది. ఈ మారు ఆలస్యంగా వర్షాలు పడటంతో ఇప్పుడు వేరుశనగ సాగుకు పదునొచ్చినా అదను తప్పిందని రైతులు చెపుతున్నారు. కొన్నేళ్లుగా వాణిజ్య పంట పత్తి జులై చివరాఖరికి బాగా సాగవుతోంది. జులై మూడవ వారం వరకు సరైన వానల్లేక ఆ పంట సాగు సైతం గణనీయంగా తగ్గింది. కృష్ణా, గోదావరి డెల్టా కాల్వలకు జూన్ మొదటి వారంలోనే నీరు విడుదల చేసిప్పటికీ ఆయా ప్రాంతాల్లో వరి నాట్లు ఊపుగా సాగలేదు. సాధారణంగా ముందస్తుగా ఖరీఫ్ పంటలు సాగు చేసే ఉత్తరాంధ్రలో కూడా అదే పరిస్థితి. పెన్నా డెల్టా కింద నెల్లూరు, తిరుపతిలో వరి కాస్తంత పర్వాలేదనిపిస్తోంది.
సాగు 27 శాతం
ఖరీఫ్ నార్మల్ సాగులో ఇప్పటికి 27 శాతమే సాగైంది. జులై 26 వరకు కావాల్సిన సాధారణ సాగులో 58 శాతం సాగు నమోదైంది. ఈపాటికి కావాల్సిన సాగులో 16.7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. సీజన్ నార్మల్లో ఆహారధాన్యాలు 25 శాతం సాగయ్యాయి. వరి 25 శాతం, తృణధాన్యాలు 41 శాతం, పప్పుధాన్యాలు 17 శాతం, వేరుశనగ 25 శాతం, మొత్తం నూనెగింజలు 27 శాతం, పత్తి 33 శాతం సాగైంది.
14 జిల్లాల్లో నాల్గవ వంతు
ఎపిలోని 14 జిల్లాల్లో సాధారణ సాగులో 25 శాతం లోపు సాగు నమోదైంది. తొమ్మిది జిల్లాల్లో 26-50 శాతం సేద్యం జరిగింది. తూర్పుగోదావరిలో 51-75 శాతం, తిరుపతిలో 76-100 శాతం పంటలు సాగయ్యాయి.











