ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఏడో రోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు యాత్రికులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాలు భజనలు, కోలాటాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా.. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు.










