Nov 03,2023 14:33

తిరుమల: శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మౌత్సవాలను నవంబరు 10 నుంచి 18 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయన్నారు.డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి.. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్ల కోటాను నవంబరు 10న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.