న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్ వారిని వారించారు. అనంతరం జి 20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్ అభినందనలు తెలియజేశారు. నేటినుంచి ఐదురోజుల (సెప్టెంబర్ 22) పాటు ఈ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో 75 ఏళ్ల ప్రస్థానంతోపాటు, సాధించిన విజయాలు, అనుభవాలపై తొలి రోజు చర్చతోపాటు.. ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు.
/p>
భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది : ప్రధాని మోడి
ప్రధాని మోడి మాట్లాడుతూ .... భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. పార్లమెంటును కొత్త ప్రదేశానికి విస్తరించడం ద్వారా ఈ దేశం 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. గణేష్ చతుర్థి నాడు కొత్త పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నామని.... నిర్విఘ్నంగా భారత్ వికాస్ యాత్ర కొనసాగిస్తామని ప్రధాని మోడీ అన్నారు. విఘ్ననాయకుడి ఆశీస్సులు కూడా మనపై ఉన్నాయన్నారు. అన్ని కలలు, సంకల్పాలు సాకారం చేసుకుందాం అని... గణేష్ చతుర్థి రోజు నుంచి భారత్ నవ ప్రస్థానం ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఈ సెషన్ అనేక విధాలుగా ముఖ్యమైనదని ప్రధాని అన్నారు. ఎంపీలందరికీ గరిష్ట సమయం కావాలని అభ్యర్థిస్తున్నానని మోడీ కోరారు. జీవితంలో కొన్ని క్షణాలు ఉత్సాహాన్ని నింపుతాయి అని, పాత విషయాలను వదిలి కొత్త పార్లమెంట్లో మంచి విషయాలను ప్రస్తావించాలంటూ మోడీ కోరారు.
చంద్రుడిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది : మోడి
చంద్రుడిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని పార్లమెంట్ హౌస్కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. శివశక్తి పాయింట్ స్ఫూర్తికి కేంద్రం జి-20 విజయవంతంగా నిర్వహించుకున్నామని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో అవకాశాలు, మన ముందున్నాయని అన్నారు. భారతదేశం గ్లోబల్ సౌత్ వాయిస్గా మారిందన్నారు. దేశంలో ఉత్కంఠ, ఉత్సాహ వాతావరణం నెలకొందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా తక్కువే అయినా సమయంపరంగా చాలా పెద్దదన్నారు. 75 ఏళ్ల ప్రయాణం ఓ కొత్త పాయింట్ నుంచి మొదలవుతోందని చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయాల సెషన్ ఇది.. అంటూ మోడి వర్ణించారు.










