హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య వరల్డ్కప్ వార్మప్ పోరుకు అంతా సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సన్నహాక మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల నేపథ్యంలో ... ఈ మ్యాచ్కు ప్రేక్షకులకు బీసీసీఐ అనుమతిని నిరాకరిచింది. ప్రేక్షకులు లేకుండానే ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టు ఇప్పటికే హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాయి.
బుధవారం పాక్, న్యూజిలాండ్ జట్లు భాగ్యనగరానికి చేరుకున్నాయి. మరోవైపు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇక 7 ఏళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాక్ క్రికెట్ జట్టుకు క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ విషయమై పాక్ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా తమ కృతజ్ఞతలను తెలిపారు. హైదరాబాదీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు. '' మాకు హైదరబాదీల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. చాలా బాగుంది. భారత్లో గడిపే రానున్న నెలన్నర రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం '' అని మరో పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఓ పోస్ట్ చేశారు.










