Nov 14,2022 10:57
  • ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో పరిస్థితి
  • మాటలతో సరిపెడుతున్న కేంద్రం
  • నష్టపోతున్న విద్యార్థులు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆ పాఠశాలల్లో పాఠాలు బోధించటానికి ఉపాధ్యాయులు లేకపోవ టంతో విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతు న్నారు. ఇతర పాఠశాలల విద్యార్థులతో పోల్చుకుంటే చదువులో వెనకబడిపోతున్నారు. అయితే, కేంద్రం ఈ మాత్రం ఈ విషయంలో మాటలతో నెట్టుకొస్తున్నది. మార్పులను తీసుకొస్తా మనీ, సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా తెలిపారు.గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌) ఎదుర్కొంటున్న భారీ ఉపాధ్యాయుల కొరతను పరిష్కరిస్తుందని భావిస్తున్న నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (ఎన్‌ఈఎస్‌టీఎస్‌) పరిపాలనాపరమైన సవరణ '' అతి త్వరలో'' ఆమోదించబడుతుందని అర్జున్‌ ముండా చెప్పారు. సెప్టెంబరులో ఒక వార్తా సంస్థ నివేదించిన సమాచారం ప్రకారం.. 378 ఈఎంఆర్‌ఎస్‌లలో, ఎన్‌ఈఎస్‌టీ ఎస్‌ సిఫారసు చేసిన 11,340 మంది ఉపాధ్యాయులకు కేవలం 4000 మంది ఉపాధ్యాయులుగా పని చేస్తుండటం గమనార్హం. వీరీలో కాంట్రాక్టు, తాత్కాలిక, శాశ్వత ఉపాధ్యాయులు ఉన్నారు.
          ఈఎంఆర్‌ఎస్‌ లలో ఉపాధ్యాయ నియామకాలను పూర్తిగా కేంద్రం నియంత్రణకు తరలించేందుకు పరిపాలనాపరమైన మార్పును త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి ఉన్న సమాచారం ప్రకారం 688 ఈఎంఆర్‌ఎస్‌లు మంజూరు కాగా, అందులో 392 మాత్రమే పని చేస్తున్నాయి. కాగా, ఈఎంఆర్‌ఎస్‌లను నిర్వహించే సంస్థ ఎన్‌ఈఎస్‌టీఎస్‌ అధికారులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను సవరించే ప్రక్రియకు వ్యయ విభాగం ఆమోదించిన తర్వాత కూడా దాని ప్రభావాలు కనిపించటానికి కనీసం కొన్నేండ్లు పడుతుందని చెప్పటం గమనార్హం. ప్రస్తుతం ఎన్‌ఈఎస్‌టీఎస్‌ వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తున్నది. ఇక్కడ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక రాష్ట్ర విద్యా సంఘాలు (ఎస్‌ఈఎస్‌టీఎస్‌) ఏర్పాటు చేయబడ్డాయి. ఉపాధ్యాయుల కొరత సమస్యను సత్వరమే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి.