Jun 26,2022 11:08

సమాజంలో సాంకేతిక ప్రగతి పెరిగే కొలదీ, శాస్త్ర విజ్ఞానం వికసించే కొలదీ మానవ జీవితం సౌకర్యవంతంగా మారుతుంది. శాస్త్రీయ దృక్పథంతో కూడిన అవగాహన మానవుల స్వభావంలో, ప్రవర్తనలో ఉన్నతమైన మార్పులను తీసుకొస్తుంది. మతం, దైవ విశ్వాసాలు, సంప్రదాయాలు, ఆచారాలు వంటివి మానవ సమాజం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. మనుషులపై మత సంస్కృతి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. మతం, సంప్రదాయాలు, ఆచారాల పేరుతో అమలైన సతీసహగమనం వంటి ఎన్నో దురాచారాలు ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయినా.. నాగరికత, విజ్ఞానం ఎన్నో రెట్టింపులు అభివృద్ధి చెందినా మతవిశ్వాసాలూ కొత్త పద్ధతుల్లో ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నాయి. దైవ విశ్వాసం అనేది వ్యక్తిగతంగా దేవుడిని ఆరాధించడంతో ఆగడం లేదు. దేవుడు, మతం పేరుతో ఇటీవల అనేక రకాల క్రతువులు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కోటి దీపాల ఆరాధన, ప్రత్యేక ఉత్సవాలు, రకరకాల బాబాల నిరంతర ప్రవచనాలు వంటివి సమాజాన్ని ఇంకా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎందరో హేతు, ప్రగతిశీలవాదులు, ప్రజాభ్యుదయాన్ని కోరుకునే బుద్ధిజీవులు, ఎన్నో సంస్థల ద్వారా సమాజంలో శాస్త్రీయ అవగాహన పెంచడానికి కృష ిజరుగుతూనే ఉంది. అయినా ఇంకా ఎంతో కృషి జరగాల్సి ఉంది. ఇప్పటికీ అనేక అశాస్త్రీయ భావనలు ప్రజల్లో రాజ్యమేలుతున్నాయి.
డా|| పి. రామమోహనరావు గారు వృత్తిరీత్యా డాక్టరైనా సామాజిక వ్యవస్థలోని లోపాలను తీవ్రంగా పట్టించుకున్న వ్యక్తి. వైద్య, సామాజిక, సైన్సు రంగాల్లోనూ చాలా విలువైన కృషి చేశారు. తను గ్రహించిన జీవితానుభవాలతో వివిధ సామాజికాంశాలను, శాస్త్రీయ దృష్టితో విశ్లేషిస్తూ 'మనం కుశలమేనా?' అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ఆయన, సతీమణి డా|| జయనీ నెహ్రూ సామాజిక, సైన్స్‌ రంగాలలోనూ విశేష సేవలందించారు. నిజామాబాద్‌లో సంజీవి నర్శింగ్‌ హోం స్థాపించి ఈ దంపతులు పేద, మధ్యతరగతి ప్రజల హృదయాలలో స్థానం పొందారు. కేవలం ఐదు రూపాయల ఫీజుతో వైద్యం అందించి, ప్రజావైద్యులయ్యారు. వైద్యం చేయడానికే పరిమితమవ్వకుండా జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రజలలో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో అక్షరాస్యతా ఉద్యమానికి ముందుండి పనిచేశారు.
ఈ పుస్తకంలో వైద్యవృత్తికి సంబంధించిన వ్యాసాలతోపాటు మూఢ నమ్మకాలపైన, అంతరిక్ష అద్భుతాలు, మాదక ద్రవ్యాల ప్రమాదాలు, స్త్రీ-పురుష అసమానతలు, వ్యవసాయ రంగం ప్రాధాన్యత, మత సామరస్యం వంటి అంశాల గురించిన సమాచారాన్ని ఉదాహరణలతో, అవసరమైన గణాంకాలతో సహా అందించారు. మానవ నాగరికతా వికాసానికి మూఢనమ్మకాలు, అశాస్త్రీయమైన ఆచారాలు ఎంత ఆటకంగా ఉన్నాయో ఈ పుస్తకం పాఠకులకు విడమరిచి చెప్తుంది. పేదలు మాత్రమే కాదు చదువుకుని, ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చిన కుటుంబాలూ మూఢవిశ్వాసాల బారిన పడి, నష్టపోవడాన్ని ఎంతో ఆవేదనగా వివరిస్తారు. చివరికి సమాజానికి విజ్ఞాన సమాచారాన్ని అందించడంలో విఫలమవుతున్న మీడియా పాత్ర గురించీ ఒక వ్యాసంలో చర్చించారు. కొన్ని వామపక్ష, అభ్యుదయ పత్రికలు మినహా ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించాల్సిన మీడియా మూఢనమ్మకాల్ని, అశాస్త్రీయ భావాలకు అడ్డుకట్ట వేయడంలో తగిన కృషి చేయడం లేదని బాధపడతారు.
'మనం కుశలమేనా?' అనే శీర్షికా వ్యాసంలో 'ఆరోగ్యం అంటే మనిషి శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా బాగుండటం అంతేకానీ కేవలం వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు' అని ఐక్యరాజ్య సమితి ఆరోగ్యం అంటే ఇచ్చిన నిర్వచనాన్ని ఉటంకించి ఆ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని మనం కాపాడుతున్నామా? అని ప్రశ్నిస్తారు. వైద్యరంగ వ్యాపారంతో పేదప్రజలకు వైద్యం అందకుండా పోతుందని వేదన చెందుతారు. ఈ పరిణామాలకు కారణమైన ప్రభుత్వాల వైద్యవిధానాల్ని, ప్రైవేటీకరణ విధానాలని సునిశితంగా విమర్శిస్తారు. తక్షణం ప్రజలకు ఉచితంగా అన్నిరకాల ఆధునిక వైద్యాలను అందించేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని డిమాండ్‌ చేస్తారు. వైద్యం గురించే కాక ఆ రుగ్మతలకు కారణమైన సామాజిక వ్యవస్థలోని లోపాలనూ వివరించే ప్రయత్నం చేశారు. నిరక్షరాస్యత, మాదకద్రవ్యాల వాడకం, మత సామరస్య ప్రాధాన్యత, శాస్త్రీయ భావాల వ్యాప్తి వంటి అనేకాంశాలు ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని, సామాజిక భద్రతని కలిగించడంలో ప్రధాన భూమిక వహిస్తాయనివ్యాసాల్లో వివరిస్తారు.
అంతేకాకుండా 'పోషకాహారం - ఆహార పదార్థల కల్తీ' అనే వ్యాసంలో ఆహార పంటల ఉత్పత్తిలో క్రిమి సంహారక మందులు ఉపయోగించడం గురించి, వాటి ప్రభావం గురించి చాలా లోతైన సమాచారాన్ని అందిస్తారు. హెచ్‌.ఐ.వి. అంశం మీద ఇచ్చిన సమాచారం కానీ, గర్భంలోనే ఆడపిల్లలను చంపటం ఏం నాగరికత? అనే వ్యాసం గానీ పాఠకులను కదిలిస్తాయి.
అసమానతల సమాజంలో కొంత మందికి కనీస అవసరాలు తీరడమూ కష్టమవుతుందని, మరికొంత మంది విలాసాల పేరుతో విశృంఖల జీవితం అనుభవిస్తారని అందవల్లే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని అంటారు. ఇవన్నీ తుదకు సామాజిక అశాంతికి దారితీస్తాయని, క్రమంగా మానవహక్కులు ఉల్లఘించబడతాయని వివరిస్తారు. వీటన్నింటిపై రామమోహనరావు గారి విశ్లేషణ పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తుంది. సమాజం మానవత్వం వైపు వికసించాలంటే శాస్త్రీయమైన ఆలోచనలు ఎంత అవసరమో ఈ పుస్తకంలోని వ్యాసాల సమాహారం తేటతెల్లం చేస్తాయి. ఒక వైద్యునిగానే గాక, ఒక బాధ్యతగల వ్యక్తిగా సామాజికదృష్టితో ఈ వ్యాసాలను అందించిన డా. రామమోహనరావు గారు అభినందనీయులు. ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదవాలి.

వొరప్రసాద్‌,
94900 99059