
- సామాజిక న్యాయం కోసం 29న మహాధర్నా
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-కడప అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులను కాలరాస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను, ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అసైన్డ్ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల 29న విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. 'దళితుల హక్కులు - సామాజిక న్యాయం కోసం' అనే అంశంపై కడపలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం దళితులు రోడ్డెక్కుతున్నా ఫలితంలేదన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి పాతరేసిందనడానికి మణిపూర్ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోన్న మోడీ సర్కారుపై రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నోరెత్తకపోవడం సరికాదన్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం తగదన్నారు. దళిత, గిరిజనులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను 300 యూనిట్లకు పెంచాలని, డప్పు చర్మకారుల పెన్షన్ రూ.5 వేలకు పెంచాలని, శ్మశానాలలో పనిచేస్తున్న కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగాన్ని కాపాడి, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో భూపోరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్ బి.నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి.అన్వేష్, సిపిఐ (ఎంఎల్) నాయకులు డబ్ల్యు రాము, బిఎస్పి జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, హేతువాద సంఘం జిల్లా కన్వీనర్ సి.ఆర్.వి.ప్రసాద్ పాల్గొన్నారు.