Aug 22,2023 14:41

ప్రజాశక్తి-గూడూరు(కృష్ణా) : గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో విద్యుత్‌ షాక్‌ సర్క్యూట్‌ వల్ల మేక ఆంజనేయులు, మేక సీతారావమ్మ,కోట సూరిబాబు,కోట సీతమ్మ నివసిస్తున్న నాలుగు నిరుపేదల పూరిల్లు అగ్నికి ఆహుతి అవటం జరిగింది. ఇంటిలోని వస్తువులు, బట్టలు, పనిముట్లతో సహా దగ్దం అవ్వటం వల్ల కట్టుబట్టలతో మిగిలారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సర్పంచ్‌ యక్కల మాధవి, నాగరాజు స్పందించి గాయపడ్డ మేక సీతారావమ్మ, మహమ్మద్‌ మస్తాన్‌ని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆస్తి నష్టం ఎనిమిది లక్షలు దాకా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గూడూరు మండల తహశీల్దార్‌ వి.విజయ ప్రసాద్‌, వీఆర్వోలు ఘటన స్థలానికి సందర్శించి విషయాలు సేకరించి తక్షణమే కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయం గురించి మంత్రి జోగి రమేష్‌, ఎంపీపీ సంఘ మధు, జడ్పిటిసి వేముల సురేష్‌ రంగబాబు, సహకార బ్యాంకు డైరెక్టర్‌ తలుపుల కృష్ణారావుల దృష్టికి తీసుకువెళ్లారు.