అమరావతి: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తపై పుంగనూరులో వైసిపి నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. వైసిపి నేత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.''పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనం. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ. బిహార్లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు. పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవే. తెలుగుదేశం అంటే ఒక కుటుంబం. మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా?సామాన్యులకు చేసిన అవమానం ప్రజలంతా గమనించారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే'' అని భువనేశ్వరి ప్రశ్నించారు.










