ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈ నెల 19 నుంచి జరగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో పోల్ వాల్ట్ విభాగంలో పాల్గొనేందుకు పున్నపురెడ్డి సన్యాసినాయుడు శ్రీలంకకు పయనమవుతున్నట్టు మాస్టర్ అద్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడుకు కిట్బ్యాగ్ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఖరగ్ పూర్లో జరిగిన జాతీయస్థాయి పోల్ వాల్ట్ విభాగం (35-40 వయస్సుగ్రూపు) పోటీల్లో పాల్గొని సన్యాసినాయుడు ప్రధమస్థానంలో నిలిచారని తెలిపారు. ప్రస్తుతం విజయనగరం ఆర్మ్డ్ రిజర్వులో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తొన్నారని తెలిపారు. అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటున్న సన్యాసినాయుడుకు ఎస్పి దీపికా పాటిల్, డీఎస్పీ శేషాద్రి, ఆర్ఐలు రమణమూర్తి, గోపాలనాయుడు, ఆర్ఎస్సై రామకృష్ణ , సీనియర్ అద్లెట్ ఆల్తి త్రినాధరావు తదితరులు అభినందనలు తెలిపారు.










