Oct 10,2023 11:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి ఒక్క పైసా కూడా రాలేదని, అరెస్టుకు బలమైన ఆధారాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు న్యూస్‌క్లిక్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు. యుఎపిఎ కేసులో రిమాండ్‌ విచారణకు వ్యతిరేకంగా న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ చీఫ్‌ అమిత్‌ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. సోమవారం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. పిటిషనర్లు, ఢిల్లీ పోలీసుల వాదనలు పూర్తయిన తర్వాత జస్టిస్‌ తుషార్‌ రావు గేదెల పిటిషన్లను వాయిదా వేశారు. ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తి తరపున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, దయాన్‌కృష్ణన్‌ వాదిస్తూ.. 'అరెస్టు సమయంలో కారణాలను పేర్కొనలేదని, ట్రయల్‌ కోర్టు రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్‌క్లిక్‌, పుర్కాయస్థ చైనా నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు' అని అన్నారు. 'అడవిలో కాల్పుల ఘటనపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చైనా ఫోన్‌ తయారీదారులు, సమ్మెలో ఉన్న రైతులపై ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలు వచ్చాయి. అరెస్టుకు ముందు సరైన కారణాలను స్పష్టం చేయలేదు. ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు' అని కపిల్‌ సిబల్‌ ఎత్తి చూపారు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. యుఎపిఎ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలన్న ప్రబీర్‌ పుర్కయస్థ డిమాండ్‌పై ఢిల్లీ పోలీసులతో సహా ప్రతివాదులందరికీ నోటీసు జారీ చేయాలా వద్దా? అనే విషయాన్ని హైకోర్టు తర్వాత నిర్ణయిస్తుంది. మంగళవారంతో కస్టడీ గడువు ముగియడంతో వారిద్దరినీ మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు.