Sep 27,2023 07:04

తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేళ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు ... పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ధి ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు.

             నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33 శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్ల లోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబో తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే కొందరు 2029 నాటికి అని, మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్దేశించిన సీట్లలో కూడా మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుకబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు.
             రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేళ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ధి ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు. లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో ?
               ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? పదేళ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి. 1973 తరువాత పాతికేళ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేళ్లపాటు 2026 వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలు వుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆ ప్రక్రియ తరువాత సిక్కిం మన దేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026 వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణలో జనాభా పెరగటంతో ఆంధ్ర ప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.
                2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026 లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029 లోక్‌సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేళ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేళ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒకవేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబాల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు. ఈ నేపథ్యంలో ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది? అసలు ఏం జరగబోతోంది? అనేవి ప్రస్తుతానికి జవాబుల్లేని ప్రశ్నలు.

శారద