Sep 05,2023 10:14

లెక్కలతో తప్పుదారి పట్టిస్తున్న మోడీ సర్కారు
సర్వే గణాంకాల్లో పారదర్శకత లోపం
జిడిపిపై ప్రభుత్వ వాదనలు నిరాధారం, నమ్మశక్యం కానివి
ఆర్థికవేత్తలు, నిపుణులు అభిప్రాయం
న్యూఢిల్లీ : 
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి దేశంలో అభివృద్ధి తీరు పైన పటారం.. లోన లొటారంలా తయారైందని ఆర్థిక వేత్తలు, నిపుణులు విమర్శిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున.. ఇవి మరింతగా తీవ్రమవుతున్నాయి. 5 ట్రిలియన్ల నుంచి 25 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి చర్చలు జరుగుతున్నాయి. మోడీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, రానున్న రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని మోడీ, ఆయన టీం ప్రచారాలు చేసుకుంటున్నారు.
 

ప్రభుత్వ వాదనలు నిరాధారం
దేశ ఆర్థికం, అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రచారాలు నిరాధారమైనవనీ, గణాంకాలతో తప్పుదారి పట్టిస్తున్నదని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానానికి చేరుకోవటానికి గత ప్రభుత్వాల విధానాలు, కృషి ఉన్నాయనీ, మోడీ ప్రభుత్వం ఇదంతా తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నదని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) గణనను, కొన్ని అంశాల ఆధారంగా దాని ఆర్థికవృద్ధి రేటును విశ్వసించలేమని అన్నారు. జిడిపి, ఉపాధి, ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం మొదలైన అంశాల్లో ప్రభుత్వ వాదనలు నమ్మదగినదిగా లేవని, ఇవి నిరాధారమైనవని ఆర్థికవేత్తలు, నిపుణులు అంటున్నారు.

ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా 'అనధికారమే'
మరిన్ని వివరాల్లోకి వెళ్లేముందు, జిడిపి గణాంకాలకు వాటి గణన పద్ధతి, పాత వాస్తవాల కారణంగా ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఉదాహరణతో అర్థం చేసుకుందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా అనధికారిక లేదా అసంఘటిత రంగంలోనే ఉంది. ఇందులో వ్యవసాయం మాత్రమే కాకుండా తయారీ, సేవా రంగాలలోని పెద్ద భాగాలు కూడా ఉన్నాయి. ఖాతాలు, గణాంకాలు అందుబాటులో లేనందున దీనిని అనధికారికం అంటారు. కాబట్టి, జిడిపిని లెక్కించేటప్పుడు, ఈ భాగాన్ని అంచనా ఆధారంగా మాత్రమే జోడించాలి. అంచనా పద్ధతిలో లోపం కారణంగా వీటిలో భారీ వ్యత్యాసం వస్తుంది. అందువల్ల, ఈ పద్ధతి తార్కికంగా, పారదర్శకంగా ఉండటం అవసరమనీ ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.
అధికారిక రంగానికి సంబంధించినంత వరకు, పరిశ్రమల వార్షిక సర్వే నుంచి దాని ఉత్పత్తి డేటాను ముందుగా పొందారు. అధికారిక, అనధికారిక రంగాల నుంచి డేటాను కలపడం ద్వారా జిడిపి గణనలో స్పష్టత ఉండదని చెప్పారు. కాబట్టి, స్థూల జిడిపి డేటా కోసం అధికారిక, అనధికారిక రంగాలు ఎలా మిళితం చేయబడతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

మోడీ పాలనలో సర్వేల ప్రక్రియ నిలిపివేత
వాస్తవానికి, అంచనాల కారణంగా, ఇంతకుముందు కూడా ఇందులో తప్పులు జరిగాయని నిపుణులు గుర్తు చేశారు. కానీ కాలానుగుణంగా, ఈ అంచనాలు తనిఖీ చేయబడ్డాయనీ, అనధికారిక రంగం అంటే కంపెనీయేతర వ్యాపారాల జాతీయ సర్వే నిర్వహించడం ద్వారా సరిదిద్దబడ్డాయని చెప్పారు. అంతేకాకుండా, సాధారణ ఆర్థిక గణన, వినియోగదారుల వ్యయ సర్వే, ఉపాధి సర్వే మొదలైనవి కూడా గణాంక గణనలను ధృవీకరించడంలో చాలా వరకు సహాయపడిందని చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం ఈ సర్వేల ప్రక్రియను నిలిపివేసిందన్నారు. ''13 ఏళ్లుగా కంపెనీయేతర ఆక్రమణ సర్వే చేయలేదు. 9 ఏళ్లుగా ఆర్థిక గణన జరగలేదు. వినియోగదారుల వ్యయం, ఉపాధి సర్వేలు 12 సంవత్సరాల క్రితం జరిగాయి'' అని చెప్పారు.