Nov 04,2023 15:21

హైదరాబాద్‌: మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ అంటూ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైనంపల్లిని బీఆర్‌ఎస్‌లో గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లాక పిచ్చోడయ్యాడంటూ మండిపడ్డారు. మైనంపల్లి గెలిచేది లేదు.. చేసేది లేదని విమర్శలు గుప్పించారు.''దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. బస్తీ దవాఖానలతో అందరికీ వైద్యం అందుతోంది. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఐటీ రంగం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. కాంగ్రెస్‌ అంటే ఒక స్కాం.. కేసీఆర్‌ అంటే అభివృద్ధి. మాయమాటలు చెప్పడమే కాంగ్రెస్‌ పని.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ లేక పరిశ్రమలు మూత పడ్డాయి. రేవంత్‌ రెడ్డి ఎంపీగా మల్కాజ్‌ గిరికి ఏం చేశాడు?. కనీసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. సీఎం అయ్యాక రేవంత్‌ రెడ్డి ఏం ఉద్దరిస్తాడు'' అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. అంతకుముందు కూడా వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శించారు. హద్దులు దాటి మాటలతో తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నేతల మాటలు విని ప్రజలు షాకవుతున్నారు.