Jul 29,2023 22:10

మాడ్రిడ్‌: స్పెయిన్‌ 100ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌ టోర్నమెంట్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన పోటీలో భారత్‌ 3-0గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. భారత్‌ తరఫున మూడు గోల్స్‌ను స్ట్రయికర్‌ లాల్‌రిమిసిమి చేయడం విశేషం. తొలి అర్ధభాగంలో 13, 17వ నిమిషాల్లో ఒక్కో గోల్‌ కొట్టిన లాల్‌రిమ్‌.. హ్యాట్రిక్‌ గోల్‌ను 56వ నిమిషంలో చేసింది. ఈ పర్యటనలో భారత్‌ను దక్కిన తొలి విజయం ఇదే. తొలి రెండు గేమ్‌లలో ఇంగ్లండ్‌పై 1-1తో, స్పెయిన్‌పై 2-2గోల్స్‌ మ్యాచ్‌లను డ్రా చేసుకున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో ఈ టోర్నమెంట్‌లో పరాజయం చవిచూడలేదు. గోల్‌కీపర్‌ సవిత ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌కు జట్టుకు అందుబాటులోకి రానుంది. గోల్‌కీపర్‌ నేహా గోయల్‌ డిఫెన్స్‌లో ఆకట్టుకుంది. లాల్‌రిమ్‌ తొలి గోల్‌చేసే సందర్భంలో డీప్‌ గ్రేస్‌ ఎక్కా, మిడ్‌ఫీల్డ్‌లో బంతిని అందించి 13వ నిమిషంలో గోల్‌ చేసేందుకు దోహదపడింది. దీంతో భారత్‌ తొలి క్వార్టర్‌లోనే 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ స్పెయిన్‌తో తలపడనుంది.