
మనదేశంలో నేడు ఒక రకమైన అశాస్త్రీయ భావజాలం వ్యాప్తి చెందుతుంది. ఇప్పటిదాకా కులమతాల కతీతంగా అంతోఇంతో ప్రజలంతా సమానమనే ఒక లౌకిక భావన ఉండేది. ఇప్పుడది పోయి, దేశంలోని ముస్లిం ప్రజలు లక్ష్యంగా విద్వేష భావాల వ్యాప్తి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రజలందరూ సమానమనే భావనకు వ్యతిరేకంగా కుం, మత, రంగు తదితర కారణాలతో వివక్షకు గురిచేసే ధోరణికి సమాజం చేరడం తిరోగమించడమే. సీనియర్ కవి, కథకుడు జి. వెంకటకృష్ణ తన తాజా కవిత్వ సంపుటి 'కంచె దాటే పాట'లో దేశంలో పేట్రేగిపోతున్న మతోన్మాద పోకడలపై దృష్టి సారించాడు. వర్తమాన సామాజిక వాస్తవ చిత్రాన్ని పాఠకుడికి అందించి, ఆలోచింపజేస్తాడు. ఒక సీరియస్ రచయితగా వెంకటకృష్ణ చూపించే సామాజిక కోణం సమస్యల తీవ్రతను పాఠకుడికి గాఢంగా అర్థం చేయిస్తుంది.
ప్రజల్ని చీలికలు చేసి పబ్బం గడుపుకుంటున్న అధికార రాజకీయాలకు ఒక ప్రజా ప్రత్యామ్నాయ అవసరాన్ని వెంకటకృష్ణ గాఢంగా అభిలషిస్తాడు 'ఏమో' అనే కవితలో - ''ఈ చీలికల నుంచి/ ఒక అల్లిక బయటపడవచ్చు/ ఇన్ని శకలాలలోంచీ/ ఒక నిర్మాణం నిలబడవచ్చు/ అన్ని విడివిడి గానాలు కలిసి/ మహారూపకంగా మారవచ్చు!'' అనడంలో ఒక మంచి మార్పుకోసం విడివిడిగా ఉన్న ప్రజాశక్తుల ఐక్యతను బలంగా ఆకాంక్షిస్తాడు కవి. అనేక కులాలు, మతాలు, బహుళ సంస్కృతులున్న దేశంలో ఏకమత సంస్కృతికి పట్టం కట్టడమన్నది అజ్ఞానంతో కూడిన ధోరణి. ఆధునిక సమాజానికి ఏమాత్రం సరిపడని అశాస్త్రీయ మార్గం. ఇది చివరకు ప్రజల మధ్య చిచ్చురేపి, మానవ విధ్వంసానికి దారితీస్తుంది. ఈ పరిణామాలకు అడ్డుకట్ట వేయకపోతే మన దేశ ప్రజలు మున్ముందు మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారు.
ఆనాటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక స్ఫూర్తితో లౌకిక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నేటిపాలకులు మతరాజ్యం వైపుగా దేశాన్ని తీసుకెళ్ళే కుట్రలు చేయడాన్ని కవి తీవ్రంగా నిరసిస్తాడు. మతసామరస్యం వెల్లివిరియాల్సిన నేలలో మతమౌఢ్యం దాపురించిన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాడు 'క్షుద్రపాదు' కవితలో- ''అవును నిజం/ ఈ దేశ సామరస్య వేదిక మీదకు/ 'ఈవిల్' యెలానో వచ్చి వాలింది''/.../ఈ జాతి సహజీవనంలో/ ఒక అపశృతి గూడు కట్టింది''/..../అజ్ఞానానికి ఆధిపత్యం సంక్రమించినపుడల్లా/ ఒక దుష్టాంగం వేల శిరస్సులెత్తుతుంది''/..../రెక్కలు సాచిన చారలడేగ సమక్షంలో/ రెపరెపలాడుతున్న కాషాయ ఛత్రఛాయ'' అంటాడు. ఈ మతరాజకీయాలు చేసేవాళ్లకి అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ దేశాల మద్దతు ఉండటాన్ని కూడా 'చారలడేగ' అంటూ మనదృష్టికి తీసుకువస్తాడు కవి. ఇక్కడే కవి లోతైన చూపు పాఠకుడికి గమనంలోకి వస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యాపారం తప్ప, ప్రజల్లో విద్వేషం రగిల్చే రాజకీయాలు పట్ల ఆక్షేపణ ఉండదు. అందుకు నేటి మనదేశ ముఖచిత్రం నిదర్శనంగా కనిపిస్తుంది
ఒక పక్క మత రాజకీయాలు దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోపక్క ప్రజలంతా కులాలుగా చీలిపోతున్నారు. ఈ పరిణామాలు ప్రజా వ్యతిరేక శక్తులకు ఊతంగా మారడాన్ని కవిత్వం చేసి ఆలోచింపజేస్తాడు వెంకటకృష్ణ 'ఒంటి కంటి ధ్యానం' కవితలో - ''ఇక్కడంతా కులం కులంగా/ కులమింకో సంగం కులంగా విడిపోయి వుండగా/ దిగ్విజయంగా ఓట్లాటలో గెలిచిపోతూ వుండు/ మాలో మేం యెన్నటికీ కలవకుండా వుండగా/ జనారణ్యాలను దండకారణ్యాలను జేసి/ తెగనరికి దహించు/ నీ యాగ క్రతువుకు నాందీబలిగా/ నిలిచేందుకు వుందిగా ముస్లిం శిరస్సు'' ప్రజలను విడదీసి, మభ్యపెట్టి ఓట్ల ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడాన్ని చెప్పి ఊరుకోడు కవి. మతం పేరుతో విద్వేషాలు రగిల్చి, ముస్లిం ప్రజలను బలిపశువులను చేయడాన్ని పాఠకులతో పంచుకుంటాడు.
ఈ కవితా సంపుటిలో కరోనాపై రాసిన కవితలూ, రైతుల పాదయాత్ర, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన వంటి అంశాలకు సంబంధించిన కవితలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైతు ఉద్యమ ప్రభావాన్ని ఆశాభావంతో కవిత్వం చేస్తాడు వెంకటకృష్ణ 'దీపధారులు' కవితలో- ''కార్పొరేట్లను విశ్వాసంతో అందలాలు యెక్కించే/ జీతగాళ్ళ పడశాలగ మారిన పార్లమెంటును/ సరిచదను చేస్తుంది నాగళ్ళ సైన్యమిప్పుడు/ జనాల మెదళ్ళలో విభజనను విత్తి/ పెంచిన విద్వేష ఫలసాయాన్ని చెడదున్ని/ సామరస్య విత్తులు జల్లే వ్యవసాయానికి/ ప్రారంభిమిపుడు!'' అంటాడు. ఏకపక్షంగా 370 ఆర్టికల్ను రద్దు చేయడం, డీమానిటైజేషన్ వంటి నిర్ణయాలతో మాకు తిరుగులేదు అనుకుంటున్న మోడీ ప్రభుత్వ అహంకారానికి సడన్ బ్రేక్ వేసింది రైతు ఉద్యమం. దేశంలోని ప్రజాస్వామిక శక్తులలో కొత్త చిగుర్లు మొలిపించింది ఆ ఉద్యమానికి జేజేలు పలుకుతాడు వెంకటకృష్ణ. వెంకటకృష్ణ ఈ తాజా కవితా సంపుటిలోని ప్రతీ కవితా నేటి కాలపు అవసరాలను, ఆకాంక్షలను వ్యక్తం చేస్తుంది. ఒక బాధ్యతగా రాసిన కవిత్వంగా పాఠకుడు గుర్తిస్తాడు. దేశంలో జరుగుతున్న పరిణామాల కంచెలను దాటి, ఒక వాస్తవిక కోణంలో కవితలుగా విశ్లేషించే ప్రయత్నం వెంకటకృష్ణ ఈ పుస్తకంలో చేశాడు. సమకాలీన సమాజ ముఖచిత్రాన్ని కవిత్వం చేసి అందించిన వెంకటకృష్ణకు అభినందనలు. ఈ పుస్తకాన్ని కావాల్సిన వారు 93968 07070లో సంప్రదించవచ్చు.
కంచె దాటే పాట
పేజీలు : 136
వెల : 100/-
రచయిత చిరునామా :
వెంకటకృష్ణ, 87/1287-1, సోమిశెట్టి నగర్,
కర్నూలు - 518 002, సెల్: 89850 34894
- వొరప్రసాద్ 94900 99059