- టి20ల్లో అత్యధిక భాగస్వామ్యం నమోదు
- నాల్గో టి20లో విండీస్పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు
ఫ్లోరిడా : నాల్గో టి20లోనూ భారత బ్యాటర్లు కదం తొక్కారు. విండీస్ నిర్దేశించిన 179పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్లు తొలి వికెట్కు 165పరుగుల అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయ తీరాలకు చేర్చారు. దీంతో భారతజట్టు కేవలం 17ఓవర్లలో శుభ్మన్ గిల్(77) వికెట్ను కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. శనివారం ఏకపక్షంగా సాగిన నాల్గో టి20లో యశస్వి జైస్వాల్(84నాటౌట్; 51బంతుల్లో, 11ఫోర్లు, 3సిక్సర్లు) శుభ్మన్ గిల్(77; 47బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లు) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్కు దిగిన విండీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. షిమ్రాన్ హెట్మైర్(61; 39బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) మాత్రమే బ్యాటింగ్లో మెరిసాడు. షారు హోప్(45; 29బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆర్ష్దీప్ సింగ్కు మూడు, కుల్దీప్ యాదవ్కు రెండు, అక్షర్ పటేల్, చాహల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలవగా.. ఐదో, చివరి టి20 ఆదివారం(13న) జరగనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్కు లభించింది.
అత్యధిక భాగస్వామ్యం
టి20ల్లో జైస్వాల్-శుభ్మన్ కలిసి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విండీస్తో జరిగిన నాల్గో టి20లో వీరిద్దరూ తొలి వికెట్కు 165పరుగులు జోడించారు. దీంతో ఈ ఫార్మాట్లో రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక జైస్వాల్ 21ఏళ్ల 227రోజులకు ఈ ఫార్మాట్లో అర్ధసెంచరీ(84పరుగులు) చేసిన నాల్గో బ్యాటర్గా నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రోహిత్(20ఏళ్ల, 143రోజులు), తిలక్ వర్మ(20ఏళ్ల 271రోజులు), రిషబ్ పంత్(21ఏళ్ల, 38రోజులు) కంటే ముందున్నారు.











