Sep 09,2023 15:11

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సును పురస్కరించుకుని భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా మోడీ సర్కారు తీరును విమర్శించారు.విందుకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ''ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ-20 సదస్సులో ఏర్పాటు చేసిన విందుకు గుర్తింపు ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యం లేని దేశాల్లో మాత్రమే జరుగుతుంది. ఇంకా మన దేశంలో ప్రతిపక్షం ఉనికిని కోల్పోయే దశకు చేరుకోలేదనే నేను భావిస్తున్నాను'' అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. యూరప్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జీ20 సదస్సుకు పక్ష నేతను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోని 60 శాతం మందికి ప్రతినిధిగా ఉన్న నేతకు ప్రస్తుత నాయకత్వం విలువ ఇవ్వడం లేదని అర్థమవుతోంది. వాళ్లు ఎందుకలా భావిస్తున్నారు అని ప్రశ్నించారు.