Sep 14,2023 06:28

'చెప్పిందే చేయాలి-చేసిందే చెప్పాలి'-గాంధీ సిద్ధాంతంగా ప్రజల ముందుకు వచ్చింది. మనిషి నిజాయితీకి, పారదర్శకతకు ఇది ఓ మంచి కొలమానం. ఆధునిక రాజకీయాల్లో గాంధీకి ఆ విశిష్ట స్థానం లభించింది గనకనే అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ అటు నేతలకు, ఇటు సాధారణ ప్రజలకు ఆయన పూజనీయుడైనాడు.
జి-20 కూటమి దేశాల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా దేశాధినేతలందరూ రాజ్‌ఘాట్‌కు వెళ్ళి ఆ విధంగా సమైక్యంగా గాంధీజీకి ఘన నివాళులర్పించారు. గాంధీ ప్రబోధించిన సంరక్షణా సూక్తులే దేశాల మధ్య సత్‌ సంబంధాలకు కీలకమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం.
అసలు అంతకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ జి-20 అధినేతలకు ట్విట్టర్‌ ద్వారా ఆహ్వానం పలుకుతూ మహాత్మా గాంధీ సందేశాన్ని ఉదహరించారు. 'మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యంగా కొత్త ప్రపంచం అడుగు ముందుకు వేయాలి.' ఇందుకు భారత్‌ తన వంతు సాయాన్ని తాను అందిస్తుందని మోడీ తెలిపారు. మానవాభ్యుదయమే లక్ష్యంగా అభివృద్ధి సాగాలని, దానినే మనమంతా ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధిగా పేర్కొంటున్నామని కూడా మోడీ వక్కాణించారు.
అంతేగాకుండా మహాత్మాగాంధీ నిలువెత్తు చిత్తరువు రాట్నంతో కూడిన జి-20 ఇతివృత్తపు కటౌట్‌ను ఇండియా గేట్‌ వద్ద అందరి దృష్టి ఆకర్షించేలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.
'ఒకే భూమి - ఒకే కుటుంబం - ఒకే భవిష్యత్‌' అనేది జి-20 ఇతివృత్తం (థీమ్‌). వినడానికి అనడానికి ఈ పలుకులు ఎంతో మాధుర్యంగానూ ఆశావహంగానూ కన్పిస్తాయి. ఊహించిన దానికన్నా ఈ సమావేశాలు చాలా ఘనంగా జరిగాయి కూడా. కాని సాధించిందేమిటి? అని ప్రశ్నించుకుంటే... 'మాటలు కోటలు దాటాయి కాని చేతలు గడప దాటలేదు' అన్నట్టయింది.
ఆఫ్రికన్‌ యూనియన్‌ (ఎ.యు)ను చేర్చుకుని జి-21 దేశాల కూటమిగా ప్రకటించడం తప్ప తక్కినదంతా ఎక్కువ భాగం యథాస్థితిగానో లేదా పక్కనపెట్టినట్టో కన్పిస్తుంది.
ప్రపంచం నలుమూలలా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఆకలి-కరువు విలయతాండవం చేస్తున్నాయి. భారతదేశంతో సహా పలు దేశాల బాల్యం పౌష్టికాహార లోపంతో గరిష్టంగా ఇబ్బంది పడుతున్నది. మానవ హక్కులు మృగ్యం అవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దేశాల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉండదు. అలాగే ఇక్కడ కూడా. ఎవరి ధోరణి వారిదే. ఎవరి ప్రయోజనాలు వారివే. ఉమ్మడి ప్రయోజనాలకు కట్టుబడటం చాలా చాలా అరుదు. భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను సభ్యదేశాలు అంగీకరించవు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐ.ఎం.ఎఫ్‌) సంస్థలు పిర్రను చూసి పీటను వేసిన చందంగా అగ్రదేశాలను ఓ రకంగానూ, పేద దేశాలను మరోరకంగానూ చూస్తుంటాయి. ఆర్థిక క్రమశిక్షణను పాటించని పెద్ద దేశాలకు అదేపనిగా రుణాలివ్వడం, క్రమశిక్షణను పాటించే చిన్న దేశాలకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం పాటించడం వంటి అసమాన పద్ధతలు కొనసాగుతూనే ఉంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో బ్యాంకుల పరిస్థితి ఎక్కడైనా ఇది షరా మామూలే.
అయితే, ప్రతి దేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కును గౌరవిస్తూనే ఇతర దేశాల పట్ల సమాన గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతను ఈ సమావేశాలు డిక్లరేషన్‌ రూపంలో మరోసారి గుర్తుచేశాయి. అదికూడా లేకపోతే ఈ సమావేశాలకు అర్థమే ఉండదు మరి! 37 పేజీల డిక్లరేషన్‌ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలని, ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది.
ఆహార భద్రత, ఆయుధ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పట్టి పీడించే మహమ్మారి వ్యాధులు, మాదకద్రవ్యాల మాఫియా, డిజిటల్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (కృత్రిమ మేధస్సు) విస్ఫోటనం, జీవవైవిధ్యం మొదలగు ఎన్నో మౌలిక సమస్యలున్నా వాటి జోలికి ఈ సమావేశాలు అంతగా పోలేదు. ఒకవేళ పోయినా అందరికీ సమ్మతమైన విశ్వసనీయమైన కార్యాచరణ ఉండదు.
ఇన్ని పరిమితులున్నా... ఈ సమావేశాలను అత్యంత ఘనంగానూ, గర్వకారణంగాను చూపించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందాలని బిజెపి, సంఫ్‌ు పరివార్‌ శక్తులు భావించడం సహజమే. ఆ యత్నంలో భాగంగానే జి-20 పేర అవసరం ఉన్నా లేకున్నా దేశవ్యాప్తంగా వందలాది అనుబంధ సభలు సమావేశాలు జరిపారు. అసలు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలే అచేతనంగా మారుతున్న తరుణంలో ఈ జి-20 సమావేశాలు మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని ఆశించిన వారికి ఇప్పుడు ఆశాభంగం ఏర్పడింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమస్య, పర్యావరణ సంక్షోభానికి కారణభూతమైన శిలాజ ఇంధనాల గురించి ప్రముఖంగా చర్చించకుండానే సమావేశాలు ముగిశాయి. వచ్చే ఏడు (2024) వరుస క్రమంలో భాగంగా ఈ సమావేశాలు జి-21గా బ్రెజిల్‌లో జరుగుతాయి.
ఈ మాత్రం దానికే అంతగా ఆర్భాటాలకు పోయి, వేలకోట్ల ప్రజాధనం వెచ్చించి విశ్వగురువుగా సంబరపడాలా? అనేది రాజకీయ పరిశీలకుల భావన. చిచ్చుబుడ్డిలా తుస్సుమనటం అంటే ఇదేగా!
ఈ సందర్భంగా మురికివాడల ప్రజానీకాన్ని తొలగించడం, పచ్చని పరదాల వెనుక వారిని దాపెట్టడం ఎక్కడికక్కడ రంగు రంగుల విద్యుత్‌ దీపకాంతులతో ఫౌంటెన్‌లను అమర్చి రాజధాని ఢిల్లీ నగరాన్ని ఇంతగా 'మేక్‌ ఓవర్‌' చేయడం అవసరమా? అనేది వారి ప్రశ్న. గోడీ భజన మీడియా అయితే ఇక సరేసరి. అడుగడుగునా భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా మోడీ ఒక్కరే ఒంటి చేత్తో ఈ సమావేశాలు నిర్వహించినట్టు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. అసలు సారం లేకుండా అలంకరణలు ఎంతున్నా ఏమి సుఖం?
కాగా, ముఖ్య విషయం రెండ్రోజులు తర్వాత బయటకు వచ్చింది. ఢిల్లీ నుండి సరాసరి వియత్నాం వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విలేకరులతో మాట్లాడుతూ కుండ బద్దలు కొట్టారు. 'మానవ మనుగడకు ఎక్కడైనా, ఎవరైనా మానవ హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. బలమైన సుసంపన్నమైన దేశ నిర్మాణానికి పౌరహక్కులు పత్రికా స్వేచ్ఛ కీలకం' అని మోడీతో తాను జరిపిన భేటీలో మాట్లాడినట్టు బైడెన్‌ తెలిపారు.
మరి ఈ విషయం పత్రికల్లో, మీడియాలో ఎక్కడా పొక్కలేదు. అందుకే 'మేం పత్రికా సమావేశం పెట్టం. మిమ్మల్ని పెట్టనీయం' అన్న చందంగా మోడీ ప్రభుత్వం తయారైందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఇదీ 'మోడీ మార్క్‌ ప్రజాస్వామ్యం' అని ఎద్దేవా చేసింది.
మణిపూర్‌లో మానవ హక్కులు మంటగలుస్తున్న విషయం ప్రపంచం ఎల్లెడలా వ్యక్తం అవుతూనే ఉన్నది. అయినా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో మతోన్మాద శక్తులు మత విద్వేష యత్నాలను నిస్సిగ్గుగా బలపరుస్తూనే ఉన్నాయి. మత సామరస్యానికి, మానవ హక్కుల సాధనకు పాటుపడిన మహాత్మా గాంధీని నఖశిఖ పర్యంతం ద్వేషించే వీరు...ఓట్ల కోసం తిరిగి అదే గాంధీ అడుగు జాడల్లోనే తాము నడుస్తున్నట్టు నటించడం... నయవంచన కాక మరేమిటి?
బిజెపి, సంఫ్‌ు పరివార్‌ ప్రజా ప్రతినిధులు సైతం గాంధీ హత్యను సమర్థిస్తూ, హంతక గాడ్సేను పూజిస్తూ ఉత్సవాలు చేసుకొనే వీరి పట్ల ప్రధాని మోడీ మౌనంగా ఉండటం తెలిసిందే. ఆయనా ఆ తానులో ముక్కే కదా. అంతా కపటంతోటే నెట్టుకు రావాలని చూస్తున్నారు. అందుకే 'చేసేది చెప్పరు. చెప్పింది చేయరు'. గాంధీ సిద్ధాంతానికి ఇది పూర్తి విరుద్ధం. అయినా జి-20 దేశాల సమావేశాలకు గాంధీనే మోడీకి బ్రాడ్‌ అంబాసిడర్‌ కావడం ప్రజలకు విడ్డూరంగానీ, మత విద్వేష శక్తులకు కాదు కదా!

వ్యాసకర్త : కె. శాంతారావు, సెల్‌ : 9959745723 /