Nov 03,2023 15:40

అదిలాబాద్‌ : అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదరు కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నరేంద్ర మగర్‌, రాజా రన్బీడే, షేక్‌ జావిద్‌, రుక్సానా, షేక్‌ కుర్బాన్‌ అనే ఐదుగురు నిందితులు ఒడిషా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆదిలాబాద్‌ రైల్వే పరిసర ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 37 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా ఒక్కరు పరారీలో ఉన్నట్టు వివరించారు. వీరి వద్ద నుంచి మూడు మొబైల్‌ ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ముఖ్యపాత్ర పోషించిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డి సాయినాథ్‌, సిబ్బందికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వి ఉమేందర్‌, రెండవ పట్టణ సీఐ అశోక్‌, ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌, సీసీఎస్‌ సిబ్బంది ఎండీ సిరాజ్‌, గంగారెడ్డి, జాకీర్‌ అలీ, వెంకటరమణ, శ్రీనివాస్‌, రాహత్‌, నరేష్‌ గంగా సింగ్‌, అరుణ, తదితరులు పాల్గొన్నారు.