ప్రజాశక్తి-ఘంటసాల(కృష్ణా) : మండుతున్న ఎండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించాలనీ, ప్రతిరోజు కనీస వేతనం రూ.600 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారానికి మూడోరోజుకు చేరుకుంది.చల్లపల్లి మండలం చల్లపల్లి నారాయణరావు నగర్లో ఉపాధి కార్మికులను కలిసి ఉపాధి హామీ కూలీలు నష్టపోతున్న భృతిని గురించి నాయకులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.రఘు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శీలం నారాయణరావు, యద్దనపూడి మధుసూదన్ రావు, పోలబత్తిన మోహన్ రావు, వాకా రామచంద్రరావు, మేడంకి వెంకటేశ్వరరావు, ఎండి.కరిముల్లా, కంచర్ల నాగరాజు, రాగోలు రామయ్య పాల్గొన్నారు.










