Sep 29,2023 12:31

చైనా : ఆసియా గేమ్స్‌ 2023లో భారత్‌ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఈ ఆసియా క్రీడల్లో ... శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్‌, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్‌ షిరన్‌ బృందం గోల్డ్‌ మెడల్‌ సాధించింది. భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.

                                                    షూటింగ్‌లోనే భారత్‌కు 17 పతకాలు..!

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్‌, పాలక్‌, దివ్య తడిగోల్‌ టీం రజతం కైవసం చేసుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్‌ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు సాధించారు. మొత్తంగా షూటింగ్‌లోనే భారత్‌కు 17 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఆరు స్వర్ణాలు ఉండగా.. 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

                                                   పతకాల పట్టికలో 4వ స్థానంలో భారత్‌...

టెన్నిస్‌ డబుల్స్‌లో భారత్‌కు రజత పతకం వచ్చింది. డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని, రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నారు. రామ్‌కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి మెడల్‌ కాగా.. సాకేత్‌కి ఇది మూడోది. ఇప్పటివరకు ఆసియా క్రీడల్లో భారత పతకాల సంఖ్య 30కి చేరింది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది.