May 31,2023 13:08

తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నట్లు, ఈ భృతిని పొందే అర్హత వయసును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సిఎం కెసిఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కెసిఆర్‌ ప్రసంగించారు.

                    దేవాలయాల నిర్వహణకు అర్చకులకిచ్చే రూ.6 వేలను రూ.10వేలకు పెంచుతున్నాం : సిఎం కెసిఆర్‌

ఇప్పటి వరకు ధూపదీప నైవేద్యం పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నదని సిఎం కెసిఆర్‌ తెలిపారు. ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ. 2 లక్షలను ఇక నుంచి యాన్యువల్‌ గ్రాంట్‌గా ఇస్తామని తెలియజేశారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింజేసే నిర్ణయం తీసుకున్నామన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్‌లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ఞాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, లోక కల్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, ఇతర పీఠాధిపతులు, పండితులు హాజరయ్యారు.