అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ శుక్రవారం వెకేషన్ బెంచ్ ముందుకు రానుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు.
ఎపి స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ... చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎసిబి కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. దాదాపు 49 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు కోరుతున్నారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. తక్షణం చంద్రబాబుకు పలు వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.










