Nov 14,2023 08:23

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా):గిరిజనుల శ్మశాన భూమిపై కన్నేసిన వైసిపి నాయకుడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అధికారులు లేని సమయం చూసి.. ట్రాక్టర్‌తో దున్నేశాడు. మృతదేహాలు పైకి రావడంతో విషయం తెలుసుకొని గిరిజనులు అక్కడికి రావడంతో వైసిపి నాయకుడు పరారయ్యాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా శంగరాయకొండ మండలం పాత శింగరాయకొండ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. ఈ భూవివాదం కోర్టులో ఉందని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డినగర్‌, మల్లికార్జున నగర్‌, పోతుల చెంచయ్య కాలనీకి శ్మశానం కోసం సర్వే నెంబర్‌ 105లో సుమారు నాలుగు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ స్థలం తనదని వైసిపి నాయకుడు చాన్‌బాషా గత ఆరు నెలల క్రితం గిరిజనులకు అడ్డం తిరిగి రచ్చ చేశాడు. గిరిజనుల ఫిర్యాదుతో చాన్‌బాషాపై అట్రాసిటీ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ఆ భూమి తనదేదంటూ ఆ వైసిపి నాయకుడు కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ నేపథ్యంలో రెండో శనివారం, దీపావళి సందర్భంగా వరసగా మూడ్రోజులు సెలవు రావడంతో అధికారులు అందుబాటులో ఉండరని ఏకంగా శ్మశానంలోకి ట్రాక్టర్‌తో వెళ్లి భూమిని దున్ని మినుము విత్తనాలు చల్లాడు. ఆ ప్రాంతంలోని గిరిజనుల మృతదేహాలను అక్కడే పాతిపెట్టేవారు. భూమి దున్నడంతో కొన్ని చోట్ల మృతదేహాలు కూడా పైకి వచ్చాయి. గిరిజనులు అక్కడకు రావడం చూసి ట్రాక్టర్‌తో సహా వైసిపి నాయకుడు పరారయ్యాడు. మృతదేహాలకు సంబంధించిన బంధువులు వచ్చి మళ్లీ మట్టితో పూడ్చిపెట్టారు. గిరిజనులు తహశీల్దార్‌ సిహెచ్‌ ఉషాకు సమాచారం అందజేశారు. విఆర్‌ఎ నరసింహ రెవెన్యూ అధికారులు ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ భూమి కోట్ల రూపాయలు విలువ చేయడంతో ఆ భూమిని చేజిక్కించుకునేందుకు ఈ వైసిపి నాయకుడిని వెనక ఉన్న బడా వైసిపి నాయకులు ముందుకు తోలుతున్నారని గిరిజన సంఘ నాయకులు విమర్శించారు. మంగళవారం రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి.. పోలీస్‌స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని కాలనీవాసులు తెలిపారు.