- ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ప్రజాశక్తి-విజయవాడ : ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని.. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఏపీతో పాటు హైదరాబాద్లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోందని సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ఇక, ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందన్న ఆయన.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయన్నారు.. ఈ పరిస్థితుల్లో పోలీసులు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ వాడకం ద్వారా సైబర్ ప్రపంచంలో చీకటి ప్రపంచం సృష్టించుకున్న వారిని ఎదుర్కోవాల్సిన బృహత్తర బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినం. గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకునే రోజు ఈరోజు. దేశప్రజలంతా మన పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజు. ఈ రోజున అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించింది. పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయలు అయ్యాయి. ఓ పోలీస్ కన్ను కోల్పోయారు. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారు.










