Aug 04,2023 22:12

ట్రినిడాడ్‌: భారత్‌, వెస్టిండీస్‌ జట్లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) షాక్‌ ఇచ్చింది. గురువారం ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టి20లో స్లో ఓవర్‌ రేటు కారణంగా రెండు జట్లకు జరిమానా విధించింది. ఇరుజట్లు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయాయి. ఈ విషయాన్ని మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ ఐసిసి దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాదు భారత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, విండీస్‌ సారథి రొవ్‌మన్‌ పావెల్‌ తమ తప్పును అంగీకరించారు. దాంతో, ఒక్క ఓవర్‌ ఆలస్యంగా వేసిన భారత్‌కు మ్యాచ్‌ ఫీజులో 5 శాతం, రెండు ఓవర్లు ఆలస్యంగా వేసిన కరీబియన్‌ జట్టుకు 10 శాతం కోత వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలిచి ఐదు టి20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.