
సరళీకరణ విధానాల వల్ల సమిష్టి జీవనం నుండి ఒంటరైపోయి, అన్నీ ఉన్నా ఏమీ లేని వైరాగ్యజీవనం నుండి తమకు తాము బయటపడడానికి యువత పడుతున్న ఘర్షణలో భాగంగా జరుగుతున్న సామూహిక, సామాజిక ఉత్సవాల్లోకి..మతతత్వం, వినిమయతత్వం జొరబడుతున్నాయి. వినాయకచవితి ఉత్సవాల్లో ప్రజల డబ్బుతో, వారి భాగస్వామ్యంతో నిర్వహించుకునే మండపాలను తమ మతోన్మాద ఎజెండాకు అనుగుణంగా ఏర్పాటు చేయించడం, అక్కడ మత జెండాలు పెట్టడం, యువత తలలకు రిబ్బన్లు పెట్టించడం, రెచ్చగొట్టే నినాదాలను ఇవ్వడం, భక్తిపేరుతో ద్వేషాన్ని నూరిపోయడం జరుగుతున్నది. వీటిపట్ల విజ్ఞులైన యువత అప్రమత్తంగా ఉండాలి. తాము కోరుకుంటున్న సామూహిక నవజీవన బృందావనానికి చీడపురుగుల లాంటి వారిని ఏరివేయాలి.
సామాజిక ఉత్సవాలు, పండుగల్లో యువత, పిల్లలు పాల్గొనడం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. వినాయకచవితి, సంక్రాంతి, పీర్ల పండుగ లాంటి ప్రజల భాగస్వామ్యంతో జరిగే పండుగలు, ప్రార్థనమందిరాలు నిర్వహించే మత కార్యక్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లలో జరుపుకునే సామూహిక ఉత్సవాలు, బంధువులు, కుటుంబ సభ్యులు జరుపుకునే వేడుకల్లో అనేక కొత్త ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి 'ఇది ఏమి వింతమ్మా! మా కాలం ఇలా లేదని' నిష్టూరంగా మాట్లాడే పాతకాలం పెద్దలు, 'ఇదే ఇప్పటి ట్రెండ్' అని సమర్థించుకుంటున్న యువత మనకు కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉత్సవాల్లో యువతీయువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో చొరవతో పాల్గొనడమేకాక, వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయే రీతిలో వీరు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. 'మనిషి అన్నవాడు మాయమవుతున్నాడు' అని ఆవేదన చెందుతున్న పరిస్థితుల్లో ఈ రకమైన సామాజిక సంబంధాల్లోకి యువత వస్తుండడం మంచి పరిణామం. అయితే ఇక్కడే రెండు ప్రమాదాలు పొంచి వున్నాయి. తమ స్వంత చొరవతో ప్రజలు నిర్వహించుకునే పండుగలు, ఉత్సవాల్లోకి కొందరు మతతత్వవాదులు చేరి వాటిలో మతోన్మాదాన్ని ఎక్కించే ప్రయత్నాలు ఒకవైపు చేస్తుండగా, మరోవైపు ఈ కార్యక్రమాల్లో వ్యాపార సంస్కృతిని పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఈ రెండు ధోరణులు విడివిడిగానూ, జమిలిగానూ జొరబడుతున్నాయి.
చదువుల్లో వచ్చిన మార్పులు
ఏ కాలంలోనైనా సామూహిక పండుగలు, ఉత్సవాల్లో యువత చురుకుగా పాల్గొంటారు. అయితే గత 30 సంవత్సరాలుగా దేశంలో అమలవుతున్న ప్రపంచీకరణ విధానాలు యువత జీవన పద్ధతుల్లో పెద్ద మార్పులు తెచ్చాయి. అప్పటి వరకు దేశ యువతలో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. అక్షరాలు తెలుసుకునే కనీస చదువు వుంటే చాలనే భావన తల్లిదండ్రుల్లో వుండేది. అందుకని ఉన్నత పాఠశాలకు మించి చదివిన వారు గ్రామాల్లో అతి తక్కువగా వుండేవారు. గ్రామాల్లో జరిగే అన్ని రకాల ఉత్సవాలు, పండుగల ఏర్పాట్లు ప్రధానంగా గ్రామ పెద్దలు చేసేవారు, వీటి నిర్వహణలో యువకులు పాల్గొనేవారు. ఈ ఉత్సవాలను మహిళలు ఉత్సాహంతో తిలకించేవారు. తర్వాతి కాలంలో చదువుల్లో వచ్చిన మార్పులు గ్రామీణ, పట్టణ జీవితాలను మార్చివేశాయి. ప్రపంచంలో ఉత్పత్తి రంగం స్థంభించి, సేవారంగం విస్తరించడంతో అందులో పని చేయడానికి అవసరమైన నిపుణుల తయారీకి గిరాకీ పెరిగింది. అందుకనే మన రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఈ కోర్సులు చదివితే విదేశాలకు వెళ్లి డాలర్లు తేవచ్చనే ప్రచారం మారుమూల గ్రామాల్లోకి కూడా చేరింది. ఇంజనీరింగ్ కోర్సులకు కృతిమ డిమాండ్ పెరిగింది. దేశంలో 2006-07లో 1151 ఇంజనీరింగ్ కాలేజీలు వుండగా, 2014-15 నాటికి 3345కు పెరిగాయి. అందులో మన రాష్ట్రంలోనే 700 కాలేజీలు వచ్చాయి. ఈ సంవత్సరం 1,49,154 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. కేవలం ఇంజనీరింగే కాదు ఇంటర్, డిగ్రీ ఇలాంటి అనేక రకాల కోర్సులు వచ్చాయి. వీటి వల్ల కొద్దిమందికి కొత్త ఉపాధి అవకాశాలు వచ్చాయి. చూస్తుండగానే గ్రామాల్లో కొన్ని ఇళ్ల ముందుకు కొత్త కార్లు, ఇంట్లోకి కొత్త ఫర్నిచర్, కొత్తకొత్త వస్తువులు, రకరకాల దుస్తులు, కొత్త అలవాట్లు పెరిగాయి. ఇది మరింతగా కొత్త చదువుల వైపు ప్రజలను తరిమింది. తల్లిదండ్రుల ఆర్థికశక్తితో, పిల్లల శక్తిసామర్థ్యాలతో సంబంధం లేకుండా చదువులు కొనే సంస్కృతిని పెంచింది. చిన్నవయసు పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ స్కూళ్లు, హాస్టళ్లలో వేయడం పెరిగింది. ఇంటర్ చదువంటే నారాయణ, చైతన్య అనేట్లుగా పరిస్థితి మారింది. పండుగలు, ఉత్సవాలు, పెళ్ళిళ్లు, చావులు ఏదైనా సరే చదువు తర్వాతే అనే వింత మనస్తత్వం పెరిగింది. ఈ క్రమంలో పిల్లలు సామూహిక, సామాజిక కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. తమ చేతిలో ప్రపంచాన్ని చూడగలిగే సెల్ఫోన్, ఇంటర్నెట్, ల్యాప్టాప్ లాంటి అనేక పరికరాలు, మంచి వేతనాలు వున్నాయి. కాని తాము ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమాలు కరువయ్యాయి. మనుషులతో కలిసి జీవించే రోజులు కుదించుకుపోయాయి. 'జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది'గా మారింది.
యువత ఎందుకు ఆకర్షితులవుతున్నారు ?
ఈ నేపథ్యంలో యువత ఎక్కువగా మాస్ ఫెస్టివల్స్, ఉత్సవాల పట్ల ఆకర్షించబడడానికి అనేక కారణాలు ఉన్నాయి. సంక్రాంతి, వినాయకచవితి, పీర్ల పండుగ లాంటి సాంస్కృతిక వారసత్వ పండుగల్లో సమూహాలుగా పాల్గొనే అంశం యువతను ఆకర్షిస్తుంది. ఈ పండుగల సందర్భంగా జరిగే సామూహిక అంశాల్లో యువతదే ప్రధాన పాత్ర. వినాయకచవితి, పీర్ల పండుగల్లో నిర్వహణ కమిటీలుగా ఏర్పడడం, విరాళాలు వసూలు చేయడం, సమిష్టిగా నిర్ణయించుకోవడం, వ్యక్తిగతంగా పని చేయడం, కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణ, కార్యక్రమానంతరం సమీక్షించుకోవడం జరుగుతుంది. ఇది ఏదో సంఘటిత సంస్థ నిర్ణయించుకున్న క్రమపద్ధతి లాగా అమలవుతుంటాయి. వాస్తవంగా ఇది తరతరాల నాటి సామూహిక సహ జీవన విధానం.
ఈ పండుగలు, ఉత్సవాల సందర్భంగా వినూత్నంగా వేదికలు (మండపాలు), కొత్త సంప్రదాయాలు, కళారూపాలు, సంగీతనృత్యాలు మరియు వంటకాల ఏర్పాటుకు, ఆనందంగా పాల్గొనడానికి యువత వీటిని వేదికలుగా చూస్తున్నారు. తమ లాంటి అభిరుచులు కలిగిన వారితో బృందాలుగా ఏర్పడడానికి, కొత్త సంబంధాలు పెంచుకోవడానికి, కొత్త అనుభవాలను పొందడానికి ఇవి తోడ్పడుతున్నాయి. వ్యక్తిగతంగా ఎంత మంచి ఆర్థిక స్థాయిలో వున్నా సమూహంలో పాల్గొని సంతృప్తి పొందడం అంత సులభం కాదు. ఏ పరిస్థితుల నుండి వారు దూరమయ్యారో ఆ పరిస్థితులను కొద్దిరోజుల పాటైనా ఇక్కడ పొందగలుగుతున్నారు. తమ లోని సృజనాత్మకతను ప్రదర్శించుకునేందుకు ఇవి సరైన వేదికలు. చదువులు, ఉద్యోగాల ఒత్తిళ్ళతో తమలోని అనేక నైపుణ్యాలను అనేక సంవత్సరాలుగా అణుచుకోవాల్సిన పరిస్థితి. దాంతో డిజైనింగ్, ఫ్యాషన్, కళ, సంగీతం, నృత్యం లాంటి అంశాల్లో తమలో దాగివున్న ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించుకునేందుకు ఇక్కడ పోటీలు పడుతున్నారు. పీర్ల పండుగల్లో నిప్పుల గుండం దగ్గర చేసే అలాయి (చిందు) సందర్భంగా కొద్దిమంది యువకులు ఒకేతరహా డ్రస్సులు, గొడుగులు, చేతిలో ధరించే పరికరాలతో పాల్గొంటుండడాన్ని మనం చూస్తున్నాము. అనే శతాబ్దాలుగా చిందు వేసే ఆచారం వున్నప్పటికీ ఇలాంటి ప్రత్యేక ఆకర్షణలు లేవు. ఎక్కడెక్కడో వున్న యువత సెల్ఫోన్ నెట్వర్కు ద్వారా ముందుగా సన్నాహాలు చేసుకొని పండుగ సందర్భంగా గ్రామాలకు, పట్టణాలకు రావడం వాటిని ప్రదర్శించడం జరుగుతున్నది. గతంలో పీర్ల పండుగలో మగవారు మాత్రమే అలాయి ఆడేవారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా పెద్ద సంఖ్యలో ఆడుతున్నారు.
వినాయక చవితి సందర్భంగా కూడా ఇలాంటి అంశాలు అనేకం ఉన్నాయి. మండపాల దగ్గర నిర్వాహకులంతా ఒకే డ్రస్సుతో వుండడం, రోజుకో రకం సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, మిమిక్రీలు, అభినయాలు, డి.జె సంగీత వాద్యాల పట్ల ఆసక్తి వున్న వారిని ఈ పండుగ అయస్కాతంలా ఆకర్షిస్తున్నది. తమ ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఇవి సరైన స్థలాలుగా యువత భావిస్తున్నారు. రొటీన్ కార్యక్రమాల నుండి విరామం పొందడానికి ఈ పండుగలు, ఉత్సవాలు ఉపయోగ పడుతున్నాయి. రోజువారీ ఒంటరితనం, నీరసం నుండి కొద్ది రోజులైనా ఉపశమనం పొందడానికి, కొత్త పరిసరాల్లో కొత్త పద్ధతులను అమలు చేయడానికి ఇవి వారికి ఉత్సాహాన్నిస్తున్నాయి. ఇక్కడ చేసే కార్యక్రమాలను, ప్రదర్శలను, తమ నైపుణ్యాన్ని, తమ అస్థిత్వాన్ని ఇతరులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రాముల్లో వీడియోలు, ఫోటోల పోస్టింగ్లు, రీల్స్...ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఉత్సవం ఏదైనా ఉత్సాహం, ఉల్లాసం కావాలి
ప్రార్థనా మందిరాలు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా యువత ఈ రకమైన ఆసక్తులతో పాల్గొంటున్నారు. రథం, విగ్రహాల ఊరేగింపులు, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో ఒకే తరహా డ్రస్సులతో పాల్గొంటున్న ధోరణి పెరుగుతున్నది. వివాహాల్లో కూడా ఇదే పద్ధతి వచ్చింది. ఒంటరిగా అదనపు డబ్బు చెల్లించి దైవదర్శనం పొందవచ్చేమో కాని...ఇలాంటి సామూహిక సంతృప్తిని పొందలేరు. నైవేద్యాల కోసమని చేసే రకరకాల వంటకాలు ప్రదర్శించుకోవడానికి, కొత్త వ్యక్తులతో సంబంధాలు కలుపుకోవడానికి ఈ ఉత్సవాలు తోడ్పడుతున్నాయి. వీటిలో భక్తిభావం ఉన్నప్పటికీ సామూహిక, సామాజిక సృజనాత్మకత ప్రధానంగా వుంటుంది. పాఠశాలలు, కాలేజీలు నిర్వహించే ఉత్సవాల్లో పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో పాల్గొంటున్నారు. వీటిల్లో తమ పిల్లలు పాల్గొనేందుకు వేలకు వేలు ఖర్చుపెట్టి విచిత్ర వేషాలు, నాట్యాలు, డ్యాన్స్లు వేయిస్తున్నారు. ఈ ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించి బంధువులకు, మిత్రులకు చూపించి వారి నుండి ప్రశంసలు పొందడం చూస్తున్నాము. ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి పిల్లల కంటే తల్లులే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తాము కోల్పోయిన బాల్యాన్ని తమ పిల్లల్లో చూసుకొని ఆనందం పొందడం జరుగుతుంది. ఆపార్ట్మెంట్ ఫంక్షన్లు, ఫ్యామిలీ గెట్టుగెదర్లు కూడా ఇలాంటి సామూహిక ఆసక్తిలో భాగమే.
మతతత్వం, వినిమయతత్వాల చొరబాటు
సరళీకరణ విధానాల వల్ల సమిష్టి జీవనం నుండి ఒంటరైపోయి, అన్నీ ఉన్నా ఏమీ లేని వైరాగ్య జీవనం నుండి తమకు తాముగా బయటపడేందుకు యువత పడుతున్న ఘర్షణలో భాగంగా జరుగుతున్న సామూహిక, సామాజిక ఉత్సవాల్లోకి..మతతత్వం, వినిమయతత్వం జొరబడు తున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజల డబ్బుతో, వారి భాగస్వామ్యంతో నిర్వహించుకునే మండపాలను తమ మతోన్మాద ఎజెండాకు అనుగుణంగా ఏర్పాటు చేయించడం, అక్కడ మత జెండాలు పెట్టడం, యువత తలలకు రిబ్బన్లు పెట్టించడం, రెచ్చగొట్టే నినాదాలను ఇవ్వడం, భక్తి పేరుతో ద్వేషాన్ని నూరిపోయడం జరుగుతున్నది. వీటి పట్ల విజ్ఞులైన యువత అప్రమత్తంగా ఉండాలి. తాము కోరుకుంటున్న సామూహిక నవజీవన బృందావనానికి చీడపురుగుల లాంటి వారిని ఏరివేయాలి. విచ్చిలవిడిగా వినిమయ సంస్కృతిని పెంచే వ్యాపార ధోరణులను అరికట్టాలి. భారీ ఖర్చులతో తాము చేసే ప్రతి ఉత్సవం అంతిమంగా తమను అప్పుల్లో ముంచి కార్పొరేట్ కంపెనీలు లాభాలు పెంచేందుకే అని గుర్తించాలి. సమూహాలతో కలిసి చేసుకునే కార్యక్రమాలకు ఆటంకమయ్యే అన్ని ధోరణులను ప్రతిఘటించాలి. మనస్సుల్లో ఐక్యతాభావం వెల్లివిరియాలి.
/ వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు / వి. రాంభూపాల్