ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛమైన జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ, నులిపురుగుల నివారణ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి నుండి స్వీకరించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యేలా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఒక రిజిస్టరులో సమావేశము తీర్మానాలు (మినిట్స్) సజావుగా నమోదు చేసి ఏ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఏలు, ఎన్నికల అధికారులు, ఎవరెవరు పాల్గొన్నారో అందరి పేర్లు తప్పనిసరిగా పేర్కొనాలన్నారు. అలాగే 6,7,8 క్లేయిము ఫారాల పూర్తి సమాచారంకూడా వారికి అందజేయాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేయాలన్నారు. రాజకీయ పార్టీల నుండి ఓటర్ల తొలగింపు కోసం గుట్టగా దరఖాస్తులు అందినపక్షంలో వాటిని సరైన పద్ధతిలో విచారించి నూటికి నూరు శాతం పారదర్శకంగా అన్ని రకాల ఆధారపత్రాలతో తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు పొందడం ప్రాథమిక హక్కు అన్నారు. బూతు స్థాయి అధికారులు(బియెల్వోలు) సరైన ఆధార పత్రాలు తీసుకొని ఓటు హక్కు కల్పించాలన్నారు. ఎలాంటి ఆధారపత్రాలు తీసుకోకుండా ఉన్న ఓట్లను తొలగిస్తే బాధ్యులైన వారి పైన క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా ఓట్ల తొలగింపు ఉందో గమనించుకొని ఓటర్ల నమోదు అధికారులు (ఈ.ఆర్. ఓ లు)ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విషయం రాజకీయ పార్టీల సమావేశంలో తెలియపరిచి సంబంధిత మినిట్స్ లో కూడా పొందుపరచాలన్నారు. యువ ఓటర్ల నమోదులో ఏఈఆర్వోలు వ్యక్తిగత బాధ్యత వహించాలన్నారు. ఓటర్లు-జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి నిర్ణీత సంఖ్యకు మించి ఉంటే దానిపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. అసాధారణ ఓటర్ల నమోదు లేదా తొలగింపు ఎక్కడ జరిగిన దానిపై అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికల విధుల నుండి ఏ ఒక్కరిని మినహాయించేది లేదని స్పష్టం చేస్తూ ప్రతి ఒక్కరూ వారికి అప్పగించిన పనిని తప్పనిసరిగా చేయాలని లేని పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి కళాశాలల వద్ద నమోదు కేంద్రాలను ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు.
ఈనెల 10వ తేదీ నుండి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అవసరమైన అల్బెండజోల్ మాత్రలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఎంపీడీవోలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్వోలు మునిసిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.










