
- ఆగస్టు మూడవ వారం వచ్చినా సరైన వానల్లేవు
- 13 జిల్లాలు, 388 మండలాల్లో వర్షాభావం
- ప్రాజెక్టుల్లో నీటి కొరత
- ఇప్పటికి కావాల్సిన సాగులో 17.43 లక్షల ఎకరాలు మైనస్
- మెట్టసాగుకు దెబ్బ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఆగస్టు రెండవ వారం గడిచాక కూడా ఈ మారు ఖరీఫ్ సాగు నిస్తేజంగానే ఉంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రాష్ట్రంలోకి ప్రవేశించాక సైతం బలహీనంగా కొనసాగుతున్నాయి. ఎల్నెనో ప్రభావమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగస్టు 17కు చూసుకుంటే ఇప్పటికి పడాల్సిన వర్షంలో 23.5 శాతం తక్కువ పడింది. పదమూడు జిల్లాల్లో తక్కువ వర్షం నమోదైంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. ఎపిలో సగానికిపైన భూభాగం వర్షాభావం కింద మగ్గుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 17 వరకు సాధారణ సగటు వర్షపాతం 353.3 మిల్లీమీటర్లు కాగా 270.2 మిమీ నమోదైంది. రాష్ట్రంలో 679 మండలాలుండగా 388 మండలాలు వర్షాభావం కోరల్లో చిక్కాయి. వాటిల్లో 42 మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్లో రెండున్నర మాసాలు ముగిశాయి. పంటల సాగుకు ఇంకా నెలన్నర మాత్రమే సమయముంది. ఇప్పటికి సీజన్ నార్మల్లో సగమే సాగైంది. ఆగస్టు 16 నాటికి కావాల్సిన సాధారణ సాగులో దాదాపు పదిహేడున్నర లక్షల ఎకరాల మైనస్ నెలకొంది.
తీవ్ర డ్రైస్పెల్
వర్షాభావం వలన మెట్ట సేద్యం బాగా తగ్గింది. వేరుశనగ, ఇతర నూనెగింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చివరికి పత్తి సాగు సైతం ఈ తడవ తగ్గింది. వేరుశనగకు అదను ముగిసింది. ఆ పంట సాగు ఇక రైతులు చేపట్టరు. డెల్టా కాల్వలకు ముందుగా నీరు వదిలినప్పటికీ వరి నాట్లు మందకొడిగానే సాగుతున్నాయి. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిరుటికంటే బాగా తక్కువున్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులలో గతేడాదికి, ఇప్పటికి నీటి నిల్వలు సగానికి సగం తక్కువున్నాయి. నీటి నిల్వలు తగినంత లేనందున మూడేళ్లుగా మూతపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కృష్ణా డెల్టాకు నీరిచ్చేందుకు ప్రకాశం బ్యారేజికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. మధ్యలో మునేరుకు వరద రావడంతో తరలింపు ఆపి మళ్లీ కొనసాగిస్తున్నారు. గోదావరికి వరదలొచ్చినా సముద్రంలో కలిశాయి. వరదలకు అక్కడక్కడ పంటలు దెబ్బతిన్నాయి. జులై చివరిలో ఆగస్టు మొదటిలో కొన్ని ప్రాంతాల్లో వారానికిపైగా ఎడతెరిపి లేకుండా వానలు కురవడంతో అక్కడక్కడ పంటలు దెబ్బతిన్నాయి. అనంతరం వానలు పూర్తిగా ఆగిపోవడంతో ప్రస్తుతం తీవ్ర డ్రై-స్పెల్ నెలకొంది. కొత్తగా పంటల సాగు అటుంచి వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి.
51 శాతమే
ఆగస్టు మూడవ వారం వచ్చినా ఖరీఫ్ సీజన్లో కావాల్సిన పంటల సేద్యంలో 51 శాతమే నమోదైంది. సీజన్ నార్మల్ 85.97 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి 43.77 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఆగస్టు 16 వరకు కావాల్సిన 61.20 లక్షల ఎకరాల్లో 17.43 లక్షల ఎకరాల్లో (28 శాతం) సాగు తగ్గింది. వరి 3.53 లక్షల ఎకరాలు (15 శాతం), తృణధాన్యాలు 15 వేల ఎకరాలు (10 శాతం), పప్పుధాన్యాలు 1.77 లక్షల ఎకరాలు (38 శాతం), మొత్తం ఆహారధాన్యాలు 5.62 లక్షల ఎకరాలు (17 శాతం), వేరుశనగ 7 లక్షల ఎకరాలు (51 శాతం), మొత్తం నూనెలగింజలు 6.95 లక్షల ఎకరాలు (47 శాతం), పత్తి 3.88 లక్షల ఎకరాలు (31 శాతం) తగ్గింది.
