Sep 30,2023 08:27

న్యూఢిల్లీ : లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించొద్దని కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్‌ సూచించింది. ఈ మేరకు పోక్సో చట్టం, ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌లపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు 22వ లా కమిషన్‌ నివేదికలను అందజేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనలను వ్యతిరేకించింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని అభిప్రాయపడింది. ''పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయస్సు 18 ఏళ్లను మార్చడం సరి కాదు. ఒకవేళ, సమ్మతి వయసును తగ్గిస్తే.. అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది'' అని లా కమిషన్‌ తమ నివేదికలో పేర్కొంది. 16-18 ఏళ్ల పిల్లలకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో.. వారు ఇష్ట పూర్వకంగానే లైంగిక కార్యకలాపాలో పాల్గొంటే.. అలాంటి కేసుల పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని న్యాయ కమిషన్‌ అభిప్రాయపడింది.''16-18ఏళ్ల పిల్లలకు సంబం ధించిన కేసుల్లో వారు తమ సమ్మతిని తెలియ జేస్తే..అది కౌమారదశలోని అనియంత్రిత ప్రేమనా? లేదా క్రిమినల్‌ ఉద్దేశాలు ఉన్నాయా అని గుర్తించడంలో న్యాయస్థానాలు అత్యంత అప్రమత్తం గా వ్యవహరించాలి'' అని లా కమిషన్‌ నివేదికలో వెల్లడించింది. పోక్సో కేసుల్లో ఎక్కువ మంది నేరస్థులు పిల్లలకు తెలిసినవారు, సన్నిహి తులు, కొన్నిసార్లు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులేనని ప్యానెల్‌ స్పష్టం చేసింది. సమ్మతి ఉందో లేదో నిర్ధారించేది దర్యాప్తు ఏజెన్సీలైతే, పోక్సో చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేయాల్సి న చాలా నిజమైన కేసులు విచారణకు నోచుకోకపో వచ్చు. దర్యాప్తు సంస్థలే వాటిని ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధ కేసులుగా ప్రకటించడం వల్ల విచారణకు నోచుకోవని కమిషన్‌ పేర్కొంది. దీనివల్ల పోక్సో చట్టం కాగితపు చట్టంగానే మిగిలిపోతుందని తెలిపింది.
 

                                                                     దశల వారీగా ఇ-ఎఫ్‌ఎస్‌ఐఆర్‌

దేశవ్యాప్తంగా ఇ-ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదును దశల వారీగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రానికి లా కమిషన్‌ సిఫారసు చేసింది. తొలి దశలో మూడేళ్ల వరకు శిక్షపడే నేరాలకు సంబంధించి కేసుల్లో ఈ విధానాన్ని అమల్లో తేవాలని సూచించింది. కేంద్రీ కృత జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపా దించింది. దీనివల్ల కేసుల నమోదులో ఆలస్యం ఉండ దని, నేరం జరిగిన వెంటనే ఫిర్యాదులు చేసేందుకు వీలుంటుందని లా కమిషన్‌ తెలిపింది.