Sep 22,2023 06:51

               ఖలిస్థానీ ఉగ్రవాద నాయకుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందన్న నమ్మకమైన ఆరోపణలు (క్రెడిబుల్‌ ఎలిగేషన్స్‌) వచ్చాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ప్రకటించడంతో భారత్‌ కెనడాల మధ్య ప్రారంభమైన విభేదాలు అంతకంతకూ తీవ్రం కావడం ఆందోళనకరం. నిర్దిష్ట సమాచారం ఉంటే దాన్ని అందజేసి ద్వైపాక్షికంగానో లేక అంతర్జాతీయ న్యాయ వేదికల ద్వారానో పరిష్కరించుకోవాలి తప్ప భారత్‌పై నిందలు వేయడం కెనడాకు తగదు. దీంతో కెనడాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు, ఇక్కడి వారి కుటుంబీకులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రపంచంలో భారత్‌కు వెలుపల ఇంకే దేశం కన్నా అత్యధికంగా సిక్కులున్నది కెనడాలోనే గనుక ఈ వివాదాల మూలంగా ఇరు దేశాల్లోని సిక్కులకు సంబంధ బాంధవ్యాలు, సాంస్కృతిక పరంగా తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. కీలక సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌ ప్రజల్లో ఇటువంటి గందరగోళం ఏర్పడితే దాని ప్రభావం దేశంపై ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా 70, 80వ దశకాల్లో అక్కడ తలెత్తిన ఉగ్రవాదం దేశ సమైక్యత, సమగ్రతలకు సవాల్‌గా మారిన విషయం మనందరికీ తెలుసు. ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ తో అణచివేసినా ఆ తరువాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య, ఆ వెంటనే ఢిల్లీలో సిక్కుల ఊచకోత వంటివి భారత్‌కు ఎన్నటికీ మానని గాయాలే !
               'ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌' అధ్యక్షుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్‌ కొలంబియా లోని సర్రే ప్రాంతంలో హత్యకు గురి కాగా మరో ఉగ్రవాది సుఖా దుంకెన్‌ విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్‌ జరిపిన దాడిలో మరణించాడు. కెనడా ప్రధాని ఆ దేశ పార్లమెంట్‌ సాక్షిగా నిజ్జర్‌ హత్యకు ఇండియా కారణం అంటూ ఆరోపణలు చేయడమేగాక సీనియర్‌ భారత దౌత్యవేత్తను ఆ దేశం నుంచి బహిష్కరించారు. అందుకు ప్రతిగా భారత్‌ కూడా కెనడియన్‌ సీనియర్‌ దౌత్యవేత్తను ఐదు రోజుల్లో ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత ఆరోపణలుగా ఖండించింది. నిజ్జర్‌ హత్యోదంతంలో తమకు ఎలాంటి నిర్దిష్ట సమాచారం అందించినా పరిశీలించేందుకు సిద్ధమని చెప్పినా ఇప్పటివరకూ కెనడా నుంచి అటువంటివి అందలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులు, అక్కడకు ప్రయాణించాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించింది. భారత్‌లో ఉంటున్న కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని ట్రూడో ప్రభుత్వం సలహా జారీ చేసిన కొన్ని గంటల్లోనే భారత్‌ ఈ ప్రకటన విడుదల చేసింది. కెనడా పౌరులకు భారతీయ వీసాలను సస్పెండ్‌ చేసింది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. నాటో, జి-7, ఫైవ్‌ ఐస్‌ తదితర కూటముల్లోని మిత్ర దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలను తనకు మద్దతుగా కూడదీసుకోవాలని కెనడా యత్నిస్తోంది. ట్రూడో ఆరోపణల్లో నిజాలు తేలాలంటే దర్యాప్తు జరగాలని, అందుకు భారత్‌ సహకరించాలని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త గురువారం సాయంత్రం ప్రకటించారు. మిగతా సంపన్న దేశాలు ఎలా వ్యవహరిస్తాయో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
           కెనడా జనాభాలో సిక్కులు 2.1 శాతం కావడం, 30 మంది ట్రూడో మంత్రివర్గంలో నలుగురు సిక్కులు ఉండడం గమనార్హం. ఓట్ల పరంగానూ పార్టీలోనూ కీలకమైన పాత్ర కలిగినందునే అక్కడి సిక్కులను బుజ్జగించడానికి ట్రూడో ప్రభుత్వం భారత్‌ తో ఇంత ఘర్షణపూరిత వైఖరి ప్రదర్శిస్తోందన్న వాదన కాదనలేనిది. ఉగ్రవాదం పట్ల భారతీయుల్లో సహజంగానే ఉన్న వ్యతిరేకతను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బిజెపి సంఘపరివార్‌ కు పరిపాటి. ఉగ్రవాదాన్ని ప్రతిఘటించే 56 అంగుళాల ఛాతీ గల నాయకుడంటూ వాట్సప్‌ యూనివర్సిటీ నుండి ఇప్పటికే కొన్ని పోస్టులు వెలువడుతున్నాయి. జాతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవడం దానికి కొత్త కాదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాధినేతలూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే నష్టపోయేది మాత్రం ప్రజలే! విభేదాలను విడనాడి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం రెండు దేశాలకూ శ్రేయస్కరం.