Sep 12,2023 06:58

            తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందన్న అభియోగాలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయగా, ఎసిబి కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్‌ విధించింది. కాగా చంద్రబాబు అరెస్టు సమయంలో సిఐడి అవలంబించిన తీరు అభ్యంతరకరం. ఆయన హోదా, వయసు, పౌర హక్కులు, చట్ట నియమ నిబంధనలను సిఐడి తుంగలో తొక్కడం ప్రభుత్వ నిర్బంధ వైఖరికి నిదర్శనం. జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు నంద్యాలలో శక్రవారం రాత్రి బస్సులో బస చేయగా, పదకొండు గంటలప్పుడు ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల వ్యవహరించినట్లు పోలీసులు చుట్టుముట్టి భీతావహం సృష్టించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి, వందల కిలోమీటర్ల దూరాన ఉన్న విజయవాడకు తీసుకొచ్చి, ఆ రాత్రంతా సిట్‌ కార్యాలయంలో ప్రశ్నించి, ఆపై ఆదివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు తీర్పు వచ్చేసరికి సాయంత్రం ఆరైంది. జోరు వర్షంలోనే అర్థరాత్రి ఒంటిగంటకు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చేర్చారు. ఈ తంతు యావత్తూ వేధింపు కోసమేనన్న రీతిలో సాగిందన్నది పలువురి విమర్శ. దర్యాప్తు నిష్పక్షపాతంగా వాస్తవాల ఆధారంగా జరగాలి.
          రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశ చర్యలు ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నాయి.రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన భావప్రకటన, నిరసన తెలిపే హక్కులు కాలరాయబడుతున్నాయి. ఏ చిన్న నిరసనను, ఊరేగింపులను, నిర్దాక్షిణ్యంగా సర్కారు పోలీసులతో అణచివేస్తోంది. ఉపాధ్యాయులు, స్కీం వర్కర్లు, కార్మికులు, ప్రతి ఒక్క తరగతి వారి నిరసనను కేసులు, అక్రమ నిర్బంధాలు, హౌస్‌ అరెస్టులతో నిలువరిస్తోంది. శ్రామిక ప్రజల ఆందోళనలను అణచివేయడంలో నాటి చంద్రబాబు ప్రభుత్వానికి ఈనాటి జగన్‌ సర్కారుకు పెద్ద తేడా ఏమీ లేదు. తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి బంద్‌, నిరసనలను అరెస్టులతో అడ్డుకుంది. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ అధికారంలో ఎల్లకాలం శిలేసుకొని ఉండదు. ప్రజలు ఆగ్రహిస్తే ప్రతిపక్షంలోకి పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తే అదే ప్రతిపక్షంలోకొచ్చాక రక్షణగా ఉంటుంది. పాలకులు అప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటే అదే ప్రతిపక్షంలోకొచ్చాక తమ మెడకు చుట్టుకుంటుందన్న స్పృహ ఉండాలి. విపక్షంలో ఉండగా వైసిపి సైతం కేేసులెదుర్కొన్నదని నిర్బంధాలను అనుభవించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలపై నిర్బంధం ప్రయోగించాలన్న ధోరణి ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు ప్రమాదం. కేంద్రంలో బిజెపి వచ్చాక ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర హక్కుల అతిక్రమణ సాగుతోంది. బిజెపి నుంచి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేర్చుకుంటున్నాయి. నిరంకుశ చర్యలను ప్రజలందరూ వ్యతిరేకించినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టగలుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.
          స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటులో రూ.270 కోట్ల ప్రభుత్వ నిధులను డొల్ల కంపెనీలు నెలకొల్పి పథకం ప్రకారం చంద్రబాబు వ్యక్తిగత లబ్ధి పొందారన్నది సిఐడి ఆరోపణ. ఇదంతా వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపని చంద్రబాబు, టిడిపి వాదన. అయితే కేసు నమోదు, దర్యాప్తు తీరునుబట్టి సహజంగానే సందేహాలొస్తాయి. 2015-16లో జరిగిందంటున్న అవినీతిపై వైసిపి వచ్చాక 2021లో కేసు నమోదైంది. సిఐడి కొంత మందిని అరెస్ట్‌ చేసి ఛార్జిషీట్‌ వేసింది. నిందితులు బెయిల్‌ మీద విడుదలయ్యారు. హైకోర్టులో విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌ అయింది. తొలుత ఎఫ్‌ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు అనూహ్యంగా ఇప్పుడు ముందుకొచ్చింది. ఐపిసి సెక్షన్‌ 409 వర్తిస్తుందా, అవినీతి నిరోధక కేసు కాబట్టి ప్రజాప్రతినిధి అరెస్ట్‌కు గవర్నర్‌ పర్మిషన్‌ తీసుకోవాలా అనేవి సాంకేతిక విషయాలు. చట్టాలను దర్యాప్తు సంస్థలు పాటించాల్సిందే. అవినీతి కేసుల్లో ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తు జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలనే ఎవరైనా కోరుకుంటారు. న్యాయస్థానాలే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిగ్గు తేల్చాలి.