మన దేహం జీవకణ నిర్మితం. ప్రతి కణంలో నిరంతరం జీవక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడే మనకు శక్తి విడుదలై ఏ పనైనా చేయగలం. జీవక్రియలంటే మనం తీసుకున్న ఆహారాన్ని మనం పీల్చే ఆక్సిజన్ మండించడం వల్ల విద్యుదావేశం (పాజిటివ్, నెగెటివ్) కలిగిన అయాన్లు వెలువడతాయి. వాటిని ఆక్సిడెంట్స్ లేదా ఫ్రీ రాడికల్స్ అంటాము. ఆహారంలోని తాజా పండ్లు, ఆకుకూరల్లో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఆ అయాన్లతో ఆక్సిడెంట్స్కు వ్యతిరేకంగా చర్య జరిపి, మిగతా కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అందుకే వాటిని యాంటీ-ఆక్సిడెంట్స్ అంటాము. ఇవి శరీరానికి వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ వలన ప్రమాదముందని, వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

అవును అది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. బయోసైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్, న్యూట్రిషనిస్టు, స్వీడన్లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ బెర్గో, అతని బృందం విటమిన్ సి, ఇ, ఎన్-ఎసిటైల్సిస్టీన్లను టాబ్లెట్ల రూపంలో వాడకూడదని ఒక నివేదిక వెల్లడించారు. ఈ టాబ్లెట్లను నీటిలో కరిగించి, ఎలుకలకు అందించారు. వారి పరిశీలనలో ఊపిరితిత్తుల క్యాన్సర్లు, శరీరం మీద కణితలు ఏర్పడి, వాటిలో కొత్త రక్తనాళాలు (యాంజియోజెనిసిస్) తయారవుతున్నాయని తేలింది.
ఈ బృందం చేస్తున్న జీవకణ పరిశోధనలో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితలపై మూలాలు దొరికాయి. దాంతో మైక్రోట్యూమర్లు, రొమ్ము కాన్సర్, మూత్రపిండాలు, చర్మ క్యాన్సర్పై కూడా దృష్టి కేంద్రీకరించింది బెర్గో బృందం.
తాజా పదార్థాలే..
తాజాపండ్లు, కూరగాయలు, సమతుల ఆహారం నుండి లభించే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యకరమే. సి, ఇ విటమిన్ల వంటి యాంటీ ఆక్సిడెంట్స్ను టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని అంటోంది ఆ బృందం.
మెటాస్టాసిస్..
కణితలు ఏర్పడి, వాటిలో కొత్త రక్తనాళాలు తయారయ్యేందుకు ఈ యాంటీఆక్సిడెంట్లు ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే ఏర్పాటు చేస్తున్నట్లు బెర్గో బృందం 'ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్'లో ప్రచురించిన తమ పరిశోధనలో పేర్కొన్నారు. అంతేకాక మెటాస్టాసిస్ (క్యాన్సర్ 4వ స్థితి) ను మరింత వేగవంతం చేస్తాయని ఆయన తెలిపారు.
డేటా..
అధ్యయనంలో భాగంగా 2003-10 మధ్య సప్లిమెంట్లు వాడిన క్యాన్సర్ రోగుల డేటాను సేకరించింది బృందం. బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు కీమోథెరపీ తీసుకునే సమయంలో 48 శాతం మంది మల్టీవిటమిన్స్, 20 శాతం మంది విటమిన్ సి, డి, ఎన్-3 నూనెలు, 15 శాతం మంది విటమిన్ ఇ, బి6, ఫోలిక్ యాసిడ్, 34 శాతం మంది క్యాల్షియం సప్లిమెంట్ల రూపంలో తీసుకున్నట్లు తేలింది. వారికి ట్రీట్మెంట్ తీసుకున్నా, వ్యాధి తగ్గకపోగా.. నెగెటివ్ రిజల్ట్ చూపింది రికార్డు.అందుకే సాధ్యమైనంత వరకూ ఆహారపదార్థాల నుండి పోషకాలను అందించాలని, లేని పక్షంలో మరణాల రేటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎవరు వాడొచ్చు..
కొంతమంది గర్భిణీలు, శాకాహారులు, ఉత్తర ప్రాంతాలలో నివసించేవారికి అదనపు విటమిన్లు కావలసి ఉంటే, వైద్యుని సలహా మేరకు ఈ టాబ్లెట్లు వాడవచ్చు. అలాకాక వీటి ద్వారానే విటమిన్లు అందుతాయని భావిస్తే.. శరీరానికి హానే గానీ మేలు కలగదని బెర్గో పేర్కొన్నారు.
వ్యాధి బారినపడిన వ్యక్తి, సప్లిమెంట్లు కూడా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనుకుంటాం. కానీ వాటి వలన క్యాన్సర్ రోగుల్లో రోగ నిర్ధారణలో జాప్యం జరుగుతుంది. చివరి స్థితిలో వ్యాధిని గుర్తించినప్పటికీ వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకలా జరుగుతుందంటే.. ఆహార పదార్థాల ద్వారా తీసుకునే విటమిన్స్ మనం ఆశించిన ఫలితాన్నే ఇస్తాయి. కానీ టాబ్లెట్లు మాత్రం..
- ఈ యాంటీఆక్సిడెంట్ల వలన బ్యాలెన్స్గా పనిచేయాల్సిన బిఎసిహెచ్1 అనే ప్రోటీన్, చురుకుగా పనిచేయడం మొదలవుతుంది.
- ఫ్రీ (ఆక్సిజన్) రాడికల్స్ స్థాయి తగ్గి, ఊపిరితిత్తుల్లో రోగనిరోధక శక్తి కారకాలు దెబ్బతింటాయి. అప్పుడు క్యాన్సర్ కారక కణాల పెరుగుదల వేగవంతమవుతుంది.
- హెచ్ఐఎఫ్ 1ఎ అనే ప్రోటీన్ కణితిలోని మైటోకాండ్రియా, గ్లైకోలైసిస్ కణాల పనితీరుని బలహీనపరుస్తుంది.










