
జర్మనీ లోని బవేరియా రాష్ట్ర రాజధాని అయిన మ్యూనిక్ నగరం, నాజీ ఉద్యమానికి ఆయువు పట్టు. హిట్లర్, అతని అనుచరులూ ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని తమ విష రాజకీయాలను జర్మనీ అంతటికీ వ్యాపింపజేశారు. యూదులపై దాడులు, పుస్తకాలను తగులబెట్టడం మొదలైంది ఇక్కడే. మ్యూనిక్ నగరాన్ని నాజీ ఉద్యమానికి 'ఆధ్యాత్మిక' కేంద్రంగా హిట్లర్ అనేక సందర్భాల్లో పేర్కొన్నాడు. నాజీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రతీ సంవత్సరం మ్యూనిక్ వచ్చేవాడు.
1933లో నాజీలు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకుండానే మ్యూనిక్ సమీపంలోని దహావ్లో కాన్సంట్రేషన్ క్యాంపును నిర్మించారు. ఈ క్యాంపుని ప్రారంభిస్తూ, మూడు రాజకీయ గ్రూపులకు చెందిన ప్రమాదకరమైన వ్యక్తులను (కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, సోషలిస్టులు) నిర్బంధించడమే దీని లక్ష్యమని అప్పటి మ్యూనిక్ పోలీస్ చీఫ్, హెన్రిక్ హిమ్లర్ ప్రకటించాడు. ఈ సమూహాలను అదుపు చేయాల్సి ఉంటుందనీ, లేకుంటే వాళ్లంతా ఆందోళనలు చేస్తూ దేశభద్రతకు ముప్పు తెస్తున్నారనీ హిమ్లర్ తన ప్రకటనలో చెప్పుకొచ్చాడు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొనే న్యాయవాదులను కూడా ఇక్కడ నిర్బంధిస్తామని హెచ్చరించాడు. జర్మన్ పార్లమెంటు భవనాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణతో జర్మన్ కమ్యూనిస్టు పార్టీని అప్పటికే నిషేధించారు. ఊహించని ఆ పరిణామం నుండి పార్టీ కోలుకోలేకపోయింది. రహస్య పార్టీగా కొనసాగేందుకు అప్పటికప్పుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాయకులు, సభ్యులు మొత్తంగా జైళ్ల పాలయ్యారు.
పరిమితంగానైనా నాజీలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన అత్యంత సంఘటిత రాజకీయ సమూహం జర్మన్ కమ్యూనిస్టు పార్టీయే. ఈ క్రమంలో ఆ పార్టీ సభ్యులు, నాయకులు ఎంతో మంది చిత్రహింసలకు గురయ్యారు. తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ వివరాలు కొంతవరకూ మ్యూనిక్లో ఉన్న 'నేషనల్ సోషలిస్ట్ పార్టీ డాక్యుమెంటేషన్ మ్యూజియం'లో చూడవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. తమ పార్టీ పేరులో 'సోషలిస్ట్' అనే మాట ఉండి తీరాలనీ, అది అప్పటికే బలంగా ఉన్న వామపక్ష సానుభూతిపరులను ఆకర్షిస్తుందనీ నాజీ పార్టీని స్థాపించిన రోజుల్లో హిట్లర్ వాదించాడు. అదే మ్యూజియంలో-అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో, జర్మన్ కమ్యూనిస్టు నాయకుడు యూజీన్ లెవిన్ నాయకత్వంలో నడిచిన తిరుగుబాటు, రెండేళ్లపాటు (1918-19) అధికారంలో కొనసాగిన బవేరియన్ సోవియట్ రిపబ్లిక్ నాటి ఘటనలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
మలి దశలో 'యూదుల సమస్యకు అంతిమ పరిష్కారం' గానూ, శాంతికాముకులైన 'జెహోవా సాక్ష్యులు' వంటి సమూహాలను అణచివెయ్యడానికీ, ఉదారవాద పార్టీల నాయకుల్ని నిర్బంధించడానికీ దహావ్ క్యాంపు ఉపయోగపడింది. ఆ తరువాత 'అనార్యులైన' జిప్సీలను, స్వలింగ సంపర్కులను అక్కడికి తరలించారు. పన్నెండేళ్ల కాలంలో రెండు లక్షల మంది ఈ క్యాంపులో ఉన్నట్లు, వారిలో యాభై వేల మంది మరణించినట్లు ఒక అంచనా.
1933లో ఆవిష్కరింపబడ్డ ఈ దహావ్, యూరప్ అంతటా నాజీలు నిర్మించిన క్యాంప్లలో మొదటిది. 1945లో అమెరికన్ సైన్యాలు మ్యూనిక్ నగరాన్ని విముక్తి చేసేంతవరకూ నడిచిన 'మోడల్' క్యాంపు కూడా ఇదే. ఒక ప్రయోగశాలగా, తర్ఫీదు కేంద్రంగా, కాలక్రమేణా ఆక్రమిత యూరప్ అంతటా నిర్మించిన అనేక క్యాంపులకు ఇది మార్గదర్శకంగా ఉపయోగపడింది. 'పారిశ్రామిక స్థాయి'లో బులెట్ వృధా కాకుండా, శవాలను 'పూడ్చిపెట్టే శ్రమ' లేకుండా, కొద్ది నిముషాలలోనే వందలాది ఖైదీల ప్రాణాలు తీయడానికి గ్యాస్ చాంబర్ల వినియోగం, ఆ పక్కనే దహనం చేసే ఏర్పాట్లు, ఇక్కడే రూపుదిద్దుకున్నవి. వైద్య పరిశోధనల పేరుతో ఖైదీలను-ముఖ్యంగా యూదులు, కమ్యూనిస్టులు, పట్టుబడిన సోవియట్ సైనికులను - అత్యంత క్రూరంగా హింసించి చంపడం ఇక్కడే మొదలైంది. ఐదు వేల మంది కోసం నిర్మించిన ఈ క్యాంపులో ముప్పై వేల మందిని కుక్కి, తిండి లేకుండా మాడ్చి, దుర్భరమైన శారీరక శ్రమ చేయించేవారు. అక్కడ జరిగిన అమానవీయ ఘోరాలన్నింటినీ ఉటంకించడం అసాధ్యం.
ఈనాటి సమైక్య జర్మన్ సమాజం, నాజీ దుర్దినాలను ఏవిధంగా గుర్తుచేసుకుంటున్నది? నిజానికి యుద్ధానంతరం, ఆ రోజుల్ని మర్చిపోవడానికీ, వాటి ప్రస్తావన రాకుండా దాటవెయ్యడానికీ అత్యధిక శాతం జర్మన్ పౌరులు ప్రయత్నించారు. 'మనం ఓడిపోయాం' అనే భావన వారిని వెంటాడింది. పన్నెండేళ్ల హిట్లర్ పాలనలో సైన్యంతో సహా మొత్తం యంత్రాంగం, నాజీల చేతిలో ఉండింది. నాజీ పార్టీ ఎక్కించిన విషం, దేశమంతటా వ్యాపించింది. నాజీ దుష్కృత్యాల వివరాలు యుద్ధం ముగిసిన తరువాతనే బయట పడ్డాయి. ప్రపంచం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది.
అప్పటి తరానికి చెందిన జర్మన్లు చాలా కాలం పాటు 'మాకేమీ తెలీదు. నాకు సంబంధం లేదు' అంటూ నైతిక బాధ్యత నుండి తప్పుకొనే ప్రయత్నం చేశారు. 1960-70ల నాటి తిరుగుబాటు దశకంలో యువతరం, 'మీరేం చూశారు? మీరేం చేశారు?' అని తమ ముందు తరాన్ని నిలదీయడం ఆరంభించింది. తమ దేశస్థుల అకృత్యాల పట్ల నేరభావంతో జర్మనీ కుంగిపోయింది. యుద్ధం ముగిసిపోయి 60-70 ఏళ్లు పూర్తయ్యాక, 'మనం ఓడిపోలేదు, నియంతలను ఓడించాం' అనే ఎరుక కలిగింది.
చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాలనే సంకల్పం ఏర్పడింది. ముఖ్యంగా నియో-నాజీ శక్తులను ఒక కంట కనిపెడుతూ ఉండాలనే స్పృహ కలిగింది. నాజీల దుర్మార్గాలు నేడు జర్మన్ స్కూలు, కాలేజీల సిలబస్లలో భాగం అయ్యాయి. విద్యార్థులు, తమ ఉపాధ్యాయులతోబాటు కాన్సంట్రేషన్ క్యాంపులను సందర్శిస్తున్నారు. చరిత్ర నేర్పిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
బలమైన పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉన్న ఒక దేశం తప్పుదోవ పడితే, ప్రజాస్వామిక సంస్థలన్నీ ధ్వంసం అవుతాయి. తిరిగి సరైన మార్గాన్ని చేరుకోవడానికి సామాన్య ప్రజలు చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జర్మనీ అనుభవం తెలియజేస్తున్నది. అందుకే, రెండే రెండు పదాలలో ఇమిడిన సందేశం ('నెవర్ ఎగైన్') దహావ్లో లిఖింపబడింది.
ఉణుదుర్తి సుధాకర్ , సెల్: 9000601068