Sep 26,2023 07:05

            అంగన్‌వాడీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకై సోమవారం విజయవాడలో చేయ తలపెట్టిన మహాధర్నా ప్రభుత్వ తీవ్ర నిర్బంధాలు, అరెస్టులతో ముగిసింది. అసెంబ్లీ సమావేశాల వేళ తమ గోడును వెళ్లబోసుకొనేందుకు అంగన్‌వాడీలు ధర్నాకు పిలుపునివ్వడంతోనే ప్రభుత్వంలో గంగవెర్రులు మొదలయ్యాయి. పట్టణం, మండలం, గ్రామం అనే తేడా లేకుండా పోలీస్‌ నిఘా తీవ్రతరమైంది. ఎక్కడ పడితే అక్కడ అంగన్‌వాడీలను విజయవాడ వెళ్లనీకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్లలో పెట్టారు. మహిళలని సైతం చూడకుండా నేతల ఇళ్లపై పడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. రోడ్లపై పోలీస్‌ క్యాంపులు పెట్టి బస్సులను, కార్లను, ఆటోలను తనిఖీలు చేసి, మహిళలుంటే చాలు కిందికి దించేసి సోదాలు చేశారు. ధర్నాకు వెళితే ఉద్యోగాలు ఊడతాయని బెదిరించారు. మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడలో, జిల్లాల్లో పోలీస్‌ తోపులాటల్లో అంగన్‌వాడీలు సొమ్మసిల్లారు. చేతులు కాళ్లూ విరిగి ఆస్పత్రుల్లో చేరారు. ఇంతటి అణచివేతలకు ఎదురొడ్డి వేలాది మంది బెజవాడ చేరుకొని మహాధర్నాను జయప్రదం చేయడంతోనైనా అంగన్‌వాడీల పోరాట తెగువ ప్రభుత్వానికి అర్థమై ఉండాలి.
           అంగన్‌వాడీల ఆందోళనను నిలువరించే క్రమంలో క్రూర నిర్బంధానికి ఒడిగట్టిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు వారికి ఇచ్చిన హామీలపై స్పందించకుండా కఠిన మొరాయింపును కొనసాగించడం దారుణం. మహాధర్నా నేపథ్యంలోనూ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసేందుకు ముందుకు రాలేదు. శాసన మండలిలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీస్‌ తిరస్కరణకు గురైంది. ప్రశ్నోత్తరాల్లో అంగన్‌వాడీల గ్రాట్యూటీపై ప్రశ్న రాగా కేంద్రానికి లేఖ రాశామని చెప్పి అక్కడికి తనకేమాత్రం బాధ్యత లేనట్లు తప్పించుకుంది. ఒక చేత్తో కేంద్రం ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో స్వాగతించిన ప్రభుత్వం మరో చేత్తో తమ ప్రభుత్వంలో పని చేస్తున్న అంగన్‌వాడీ మహిళలపై ఉక్కుపాదం మోపడాన్ని బట్టి సర్కారీ దమన నీతి అర్థమవుతుంది. అంగన్‌వాడీ మహిళలందరూ గిరిజన, దళిత, బిసి, పేదలే. వారి నోరు నొక్కి సామాజిక న్యాయం సాధిస్తామనడం ప్రభుత్వ కపట ప్రేమను తెలుపుతుంది.
              అంగన్‌వాడీ ఉద్యోగులది సుదీర్ఘ పోరాటం. పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు తెలంగాణలో ఇచ్చే దానికంటే వెయ్యి ఎక్కువిస్తామని హామీ ఇచ్చారు. 2021 పే రివిజన్‌ దగ్గర నుంచి తెలంగాణ సర్కారు వర్కర్లకు నెలకు రూ.13,650, హెల్పర్లు, ఆయాలకు 7,800 ఇస్తోంది. మన దగ్గర మాత్రం రూ.11,500, రూ. 7 వేలు మాత్రమే ఇస్తున్నారు. అక్కడికంటే వెయ్యి ఎక్కువిస్తామన్నారు కదా అని అడిగితే ప్రభుత్వం నుంచి జవాబు లేదు. అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వాలని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ఊసే లేదు. అంగన్‌వాడీలు తమకు రిటైర్మెంట్‌ బెనిఫిట్లు, ధరలకనుగుణంగా జీతాలు, ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న సెంటర్లకు అద్దెలు, టిఎ బకాయిలు, పెరిగిన ధరలకనుగుణంగా 'జగనన్న సంపూర్ణ పోషణ' మెనూ చార్జీలు, గ్యాస్‌ ఖర్చులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఫేస్‌ యాప్‌లు, పనిభారం తగ్గించమంటున్నారు. ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కాదు. అడగటమే నేరమన్నట్లు అంగన్‌వాడీలపై సర్కారు నిర్బంధాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధం. అంగన్‌వాడీల వేతనాలు ఎప్పుడో 2011లో యుపిఎ-2 హయాంలో వర్కర్లకు 3 వేలు, ఆయాలు, హెల్పర్లకు 1,500 అయ్యాయి. అప్పటి నుంచి పెరగలేదు. మోడీ 2018 ఎన్నికల ముందు పెంచుతామన్నా అమలు కాలేదు. పైగా నూతన విద్యావిధానం, ప్రైవేటీకరణ, నిధుల కోతలతో మోడీ సర్కారు ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయబూనింది. గర్భిణులకు, బాలింతలకు, బాలలకు కాస్తంత ఆహారం అందిస్తున్న పథకం బక్కచిక్కితే పేదలకే నష్టం. అంగన్‌వాడీల డిమాండ్లు వాళ్ల వ్యక్తిగతం కాదు. భావి భారతానిది. ప్రజలందరూ వారి పోరాటానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. తెలుగునాట అంగన్‌వాడీల వీరోచిత పోరాటానికి ఘన చరిత్రే ఉంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా సాగిన పోరే కడకు ఆ ప్రభుత్వ పతనానికి నాంది అయింది. వైసిపి ప్రభుత్వం ఆ గుణపాఠాన్ని గుర్తెరిగి మసలుకోవాలి.