ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : భవ్య శ్రీని అత్యాచారం చేసి, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాయదుర్గం కళాశాల విద్యార్థినీలతో కలిసి స్థానిక వినాయక సర్కిల్లో ధర్నా, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెనమలూరు మండలం వేణుగోపాల పురానికి చెందిన భవ్య శ్రీ అనే విద్యార్థిని అతి దారుణంగా ముగ్గురు యువకులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత మార్చి గుర్తు పట్టకుండా ఉండేందుకు గుండు గీసి కనుబొమ్మలను నాలుకను కోసి చంపడం హేయమైన చర్య అన్నారు. ఈ సంఘటన జరిగి మూడు రోజులు గడిచినా దీనిపై స్థానిక ఎమ్మెల్యే రోజా కూడా ఒక మహిళగా స్పందించకపోవడం శోచనీయమన్నారు. వైసిపి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక దిశ చట్టం తెచ్చారని అది కేవలం అలంకార ప్రాయమైందని ఆరోపించారు. ఇది ప్రభుత్వానికి తీరని మచ్చ అని తెలిపారు. దిశ చట్టం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ రాక్షసులను అరెస్ట్ చేసే కఠినంగా శిక్షించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలో ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున, సిపిఎం తాలూకా కార్యదర్శి మల్లికార్జున, ఎంఆర్పిఎస్ హరి గోపాల్, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వడ్డే జయన్న, బహుజన్ సమాజ్ పార్టీ తాలూకా అధ్యక్షులు ఉల్లిగప్ప, వడ్డే సంఘం నాయకులు అధ్యక్షులు శ్రీనివాసులు, యూత్ అధ్యక్షుడు కేశవ్, ఏ ఐ వై ఎఫ్ కుమార్ నాయక్ , యూత్ కాంగ్రెస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.











