
విపత్తు వచ్చినప్పుడు హడావిడి మాటలతో అనవసర కాలహరణం చేయకుండా-సకాలంలో స్పందించటం, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించటం ప్రభుత్వాల బాధ్యత. అంతేకాదు; ఆ విపత్తును ఆదిలోనే నియంత్రించి, విస్తరించకుండా చూడడం ప్రధాన కర్తవ్యం. కేరళలో నాలుగోసారి నిపా వైరస్ గురించిన జాడ తెలిసిన వెంటనే అక్కడి వామపక్ష ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. ఆగస్టు ఆఖరివారంలో కోజికోడ్లో నిపా వైరస్ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలూ వెంటనే అప్రమత్తమై వ్యాధి మరింతగా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఆరోగ్య మంత్రి వీణాజార్జ్, ప్రజాపనుల శాఖ మంత్రి అహ్మద్ రియాజ్ వెంటనే ఆ ప్రాంతానికి తరలివెళ్లి, కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యక్షంగా నియంత్రణా చర్యలను పర్యవేక్షించారు. నిపా సోకిన తొలి వ్యక్తి వ్యాధి బయటపడటానికి కొద్దిరోజుల ముందు ఏయే ప్రాంతాల్లో తిరిగాడో అతడి మొబైల్ ఫోను ఆధారంగా అధికారులు రూట్మ్యాప్ తయారు చేశారు. తక్షణం ఆ ప్రాంతాలను ఐసోలేట్ చేసి, కాంటాక్టుల జాబితా రూపొందించారు. ఆ లిస్టులోని అందరి నుంచి నమూనాలు సేకరించి, వారికి వైరస్ సోకిందా లేదా అన్నది పరీక్షించారు. అలాగే, ఆ ప్రాంతంలోని వివిధ జంతువుల నుంచీ నమూనాలు సేకరించారు. నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యేదాకా వారిని ఇతరులతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా, నలుగురు చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్ బాధితుల కుటుంబీకుల, సంబంధితుల నమూనాలు సేకరించి, పరీక్షలు జరపగా - అవన్నీ నెగిటివ్గా వచ్చాయి. తాము తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని, నిపా ప్రమాదం ఇప్పటికి తప్పినట్టేనని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
నిపా వైరస్ మనుషులకు సోకి మరణాలు సంభవించటాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేషియాలో గుర్తించారు. 1998 - 99 ప్రాంతంలో అక్కడ వ్యాధి బారిన పడ్డ 250 మందిలో 105 మంది మృతి చెందారు. 2001లోనూ, 2012లోనూ బంగ్లాదేశ్లోని బహర్పూర్ జిల్లాలో నిపా వైరస్ వ్యాపించి, బాధితుల్లో 75 శాతం మంది మరణించారు. 2001లో భారతదేశంలో తొలిసారిగా పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో నిపా వైరస్ సోకటాన్ని గుర్తించారు. అప్పట్లో అక్కడ నిపా విజృంభించి, వైరస్ సోకిన 71 మందిలో 50 మంది మరణించారు. 2007లో అదే రాష్ట్రంలోని నదియాలో 30 మందికి వైరస్ ప్రబలి, ఐదుగురు మరణించారు.
కేరళలో తొలిసారి 2018 మేలో నిపా వైరస్ వెలుగు చూసింది. 17 మంది మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలోనే వ్యాధిని గుర్తించటానికి, వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవటానికి స్థానిక సంస్థలను, సంబంధిత శాఖలను సమాయత్తం చేసింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నియంత్రణ ... అన్న త్రిముఖ వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసింది. 2019లో ఈ వైరస్ ఎర్నాకుళం జిల్లాలో వెలుగు చూసినప్పుడు స్థానిక సంస్థల చొరవ, రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తత కారణంగా ఒక్క మరణం కూడా లేకుండానే పరిస్థితి చక్కబడింది. 2021లో మూడోసారి కోజికోడ్లో నిపా వైరస్ బయటపడింది. ఒక బాలుడు మృతి చెందాడు. ఈసారి కూడా అదే జిల్లాలో వైరస్ వెలుగు చూసి, రెండు వారాల్లోనే నియంత్రణలోకి వచ్చింది.
ఒక ప్రాణాంతక వైరస్ ప్రబలినప్పుడు దానిని గుర్తించి, తగు చర్యలు చేపట్టే సమయానికే అది మరింత విస్తరించి పోతుంది. కానీ, కేరళలో పరిస్థితి అందుకు భిన్నం. 2018 నాటి నిపా వైరస్ విజృంభణ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖకు, స్థానిక సంస్థలకు ఒక గొప్ప పాఠం. వ్యాధి జాడ తెలిసిన ఆదిలోనే ఎలా అప్రమత్తం అవ్వాలో, ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో స్థానిక సంస్థలు గొప్ప అనుభవంతో వ్యవహరిస్తాయి. ఆ తరహా స్పందనకు అనుగుణంగా అక్కడి స్థానిక సంస్థలు విధుల చేత, నిధుల చేతా బలోపేతం చేయబడ్డాయి. కోవిడ్ కాలంలో వైరస్ నియంత్రణలోనూ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలూ చూపిన చొరవ ఐక్యరాజ్య సమితి అభినందనలను అందుకొంది. ప్రజా ప్రభుత్వపు దృఢ సంకల్పానికి, ప్రజారోగ్యం పట్ల నిరంతర బాధ్యతకూ కేరళ వామపక్ష పాలన గొప్ప ఉదాహరణ. అక్కడి ప్రజల భాగస్వామ్యం, గ్రామ పంచాయతీల స్వతంత్ర చొరవ అభినందనీయం, అనుసరణీయం.