Oct 19,2023 10:54

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయభేరి బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర భూపాలపల్లికి చేరుకుంది. ఈ క్రమంలోనే భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు అంశాన్ని మేనిఫెస్టోలో చేరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులను రెగ్యులర్‌ చేస్తామన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకాలం ఒక్క అధికారినే సింగరేణికి సీఎండీగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. గనుల బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ మద్దతు తెలపలేదా అన్నారు. సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాలన్నారు. గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సమస్యలు అన్ని పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్‌ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3న కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలన్నారు.