Oct 24,2023 15:41

ప్రజాశక్తి తిరుమల : టీడీపీ- జనసేన పార్టీల పొత్తులపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్‌, లోకేష్‌ ఇద్దరు కలిసి పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు. పాడుతా తీయగా కార్యక్రమంలాగా ఇటు ఆరుగురు అటు ఆరుగురు కూర్చుని సెలక్షన్‌ చేశారు.. అర సున్న.. అర సున్న కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించడం.. కామెడిగా ఉంది అని ఆమె సెటైర్లు వేశారు. వై ఏపి నీడ్స్‌ పవన్‌ కళ్యాణ్‌,చంద్రబాబు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నారా భువనేశ్వరి యాత్ర పరిస్థితి లేదు.. లోకేష్‌ యువగళానికి మంగళం పాడాడు అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. ఫ్యాషన్‌ షోకి వెళ్ళి వీళ్ళు ప్రజల కోసం రోడ్డుమీద రాలేరు అని కామెంట్స్‌ చేశారు. ప్రజలు నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను చీ కోట్టి ఓడించారు అని ఆమె తెలిపారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలని బాగా గట్టిగా దేవుడికి పూజలు చేశారు.. మేము నిజం గెలవాలనే కోరుకుంటున్నాం.. చంద్రబాబు జైల్లోనే శాశ్వతంగా ఉండాలని వెంకటేశ్వరికి పూజలు చేసినట్లు ఉన్నారు అని మంత్రి రోజా అన్నారు. నిజమే గనుక గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉంటాడు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్‌, భువనేశ్వరీ కూడా జైల్లోనే ఉంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం గెలవాలంటే మనస్పూర్తిగా ఉంటే భువనేశ్వరి సీబీఐ ఎంక్వైయిరీ కోరితే నిజం ఖచ్చితంగా గెలుస్తుంది అని మంత్రి అన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌, ఐఆర్‌ఆర్‌ కేసులో సీబీఐ ఎంక్వైయిరీని భువనేశ్వరీ కోరాలీ అని మంత్రి రోజా డిమాండ్‌ చేశారు.