Aug 10,2023 14:38
  • రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబు
  • జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌

ప్రజాశక్తి-కర్నూలుకార్పొరేషన్‌ : చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టిడిపి కార్యకర్తలు పోలీసుల తలలు పగులగొడితే కేసులు పెట్టక వారికి సన్మానం చేస్తారా అంటూ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం సుభాష్‌ తన కార్యాలయంలో పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సుభాష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంచివారు కాబట్టే చంద్రబాబును ఇంకా అరెస్ట్‌ చేయలేదు అని బోస్‌ అన్నారు. పచ్చి అవకాశవాది, రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబు నాయుడు అని బోస్‌ ఆరోపించారు. రాష్ట్రంలో పెద్దయెత్తున అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా పోలీసులపై బెదిరిస్తూ, వైసిపి నాయకుల అంతు చూస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అంతం చేస్తానంటు మతితప్పిన వాడిలా విచక్షణ కోల్పోయి చంద్రబాబు మాట్లాడుతున్నాడని బోస్‌ ఆరోపించారు. చంద్రబాబు ప్రకటిస్తున్న హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఉత్తిత్తి హామీలు ఎన్నైనా ప్రకటిస్తారని బోస్‌ విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దేవపూజ ధనుంజయ ఆచారి, బత్తుల లక్ష్మీ కాంతయ్య, గోనెగండ్ల మురళి నాయుడు పాల్గొన్నారు.