- రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి లైబ్రరీలు
- బిల్లు తెచ్చేందుకు కేంద్రం యోచన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రంథాలయాలను త్వరలో కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లోకి తీసుకోనుంది. రాష్ట్ర అంశాల్లోకి చొరబడేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా, సమాఖ్య వ్యవస్థపై పోటుగా పలువురు దీనిని పరిగణిస్తున్నారు. గ్రంథాలయాల పనితీరులో జోక్యం చేసుకోవడానికి, సంఫ్ు పరివార్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృత ఎజెండాలో భాగమే ఈ చర్య అని చాలా మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల పరిధిలోని లైబ్రరీల వ్యవస్థను ఉమ్మడి జాబితా (కాంకరెంట్ లిస్ట్)కి బదిలీ చేసేందుకు, తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఢిల్లీలో జరిగిన రెండు రోజుల 'ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్-2023'లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన గ్రంథాలయాల ప్రతినిధులు హాజరైన సందర్భంగా, లైబ్రరీలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడంపై చర్చలు జరిగాయి. రాజారామ్మోహన్రారు లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టరు జనరల్ ప్రొఫెసర్ అజరు ప్రతాప్ సింగ్ లైబ్రరీలను సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ సంకల్పానికి సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర గ్రంథాలయాలను తీర్మానం చేసి కేంద్ర మంత్రిత్వశాఖ పరిశీలనకు సమర్పించాలని కోరినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఎపి నుంచి ఎవరూ హాజరుకాలేదు. తెలంగాణ నుంచి గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, 14 జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్లు పాల్గొన్నారు.
తీవ్రంగా వ్యతిరేకించిన కేరళ
లైబ్రరీలను ఉమ్మడి జాబితాకు బదిలీ చేయడాన్ని కేరళ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు కేంద్రం చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేరళలో లైబ్రరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలనా వ్యవస్థ ఉందని, లైబ్రరీ వ్యవస్థను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో ప్రజాస్వామ్య స్వభావాన్ని, వైవిధ్యాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది రాష్ట్రాల అధికారాలు, గ్రంథాలయాల స్వాతంత్య్రానికి భంగం కలిగించడమేనని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే గ్రంథాలయాలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతాయని అన్నారు. పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిధుల పంపిణీలో కూడా వివక్ష చూపే అవకాశం ఉందని తెలిపారు.
దేశంలో 46,746 లైబ్రరీలు
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 46,746 లైబ్రరీలు ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 12,191 లైబ్రరీలు ఉన్నాయి. కేరళలో 8,415, కర్ణాటకలో 6,798, తమిళనాడులో 4,622, గుజరాత్లో 3,464 లైబ్రరీలు ఉండగా, ఎపిలో 978, తెలంగాణలో 672 లైబ్రరీలు ఉన్నాయి. ఎపిలో 13 జిల్లా, 4 డివిజనల్, 178 సిటీ, టౌన్, 782 గ్రామీణ లైబ్రరీలు ఉన్నాయి.
తెలుగుగడ్డపై గ్రంథాలయాల ఉద్యమం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ లైబ్రరీలు మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించబడుతున్నాయి. 1956లో అవిభక్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని 11 జిల్లాల్లో మద్రాసు పౌర గ్రంథాలయాల చట్టం, తెలంగాణ ప్రాంతంలోని 9 జిల్లాల్లో హైదరాబాద్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం అమలులో ఉన్నాయి. సమ్మిళిత చట్టం కోసం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960లో రూపొందించబడింది. ఈ చట్టం 1964, 1969, 1987, 1989, 2016లో వరుసగా సవరించబడింది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, తెలంగాణ గ్రంథాలయాల కోసం ప్రత్యేక చట్టం రూపొందించబడింది. 19వ శతాబ్దంలో ఆంధ్రాలో పబ్లిక్ లైబ్రరీ ఉద్యమం విజయవతంగా సాగింది. ఆ తరువాతి దశాబ్దాలలో ఇది క్రమంగా పెరిగింది. 1800లో పరవస్తు కుటుంబానికి చెందిన ఒక ప్రైవేట్ లైబ్రరీ ప్రజల కోసం తెరవబడింది. ఇది తరువాత ఆర్ష గ్రంథాలయంగా అభివృద్ధి చేశారు. రాజా రామేశ్వర రాయలు (1821-1865) లైబ్రరీ కూడా వనపర్తి, మహబూబ్నగర్లలో ప్రజలకు తెరిచారు.










