Sep 12,2023 06:57

ఏదైనా ఒక దేశం, అందునా, ఒక పెద్ద దేశం ఎగుమతులను పెంచడం ద్వారా అధిక వృద్ధిరేటును సాధించాలన్న వ్యూహాన్ని అనుసరిస్తే, ఆ దేశం మీద సామ్రాజ్యవాద దేశాలు కన్నెర్ర చేస్తాయి. అధికోత్పత్తి సమస్య ఉన్నా, లేకపోయినా, ఒక మూడవ ప్రపంచ దేశం గనుక ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకుంటే సామ్రాజ్యవాద దేశాల నుండి ప్రతి చర్యలు తప్పవు.

కేవలం దిగుమతులను తగ్గించుకున్నంత మాత్రాన ఒకానొక దేశం వృద్ధి రేటును పెంచుకోజాలదు. దిగుమతులు తగ్గిస్తే, దాని ఫలితంగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాని అది ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఆర్థిక వృద్ధిరేటును నిత్యం పెంచుకోవాలంటే దానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఒక్కటే మార్గం. ద్రవ్యలోటును పెంచడం ద్వారా అయినా లేక పన్నుల ఆదాయాన్ని పెంచడం ద్వారా అయినా ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. కాని అందుకు నయా ఉదారవాద విధానాలు అనుమతించవు.

పెట్టుబడిదారీ వ్యవస్థ నిజానికి చాలా మంచిదని, దానిలో స్వత:సిద్ధంగా ఎటువంటి లోపాలూ లేవని, ఎక్కడైనా లోపాలు తలెత్తితే దానికి కారణం అప్పుడు పాలిస్తున్న ప్రభుత్వాలు చేసే పొరపాట్లేనని కొందరు ఉదారవాద బూర్జువా రచయితలు చెప్తారు. ఆ విధంగా చేయడంవల్ల వాళ్ళు నమ్ముకున్న స్వంత, తప్పుడు సిద్ధాంతాలపై నమ్మకాన్ని కొనసాగిస్తూ వుండవచ్చు, మరోపక్క ఆ వ్యవస్థ వలన తలెత్తే ఇబ్బందులకు రాజకీయ నాయకులను బాధ్యుల్ని చేసి వారి చేతకానితనాన్ని నిందించనూవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యం అందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పడం కూడా అటువంటి ఒక ప్రయత్నమే. పెట్టుబడిదారీ విధానాన్ని అందంగా చిత్రించే ప్రయత్నమే. సామ్రాజ్యవాద దేశాలు తాము ఆక్రమించుకున్న దేశాలపై శతాబ్దాల పాటు పెత్తనం సాగించాయి. ఆ వలస దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేశాయి. ఆ దేశాల్లో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోడానికి కారణం సామ్రాజ్యవాద దేశాలు తమ వలసలను కొల్లగొట్టేందుకు వీలు కల్పించే విధంగా వాణిజ్య సంబంధాలను బలవంతంగా అమలు చేశాయి. ఈ అనుభవాల తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థను అందంగా చూపించడం సాధ్యం కాదు. కాని, ఉదారవాద బూర్జువా పండితుల సిద్ధాంతాల్లో ఎక్కడా వలస దోపిడీ అన్న పదమే కనిపించదు !
           అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది భాగస్వామ్య దేశాలన్నింటికీ లాభదాయకంగా ఉంటుంది అని ఉదారవాద ఆర్థికవేత్తలు అంటారు. ఆ విధంగా ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలన్నింటిలోనూ ఉపాధి కల్పన పూర్తి స్థాయిలో ఉంటుందని, పూర్తి స్థాయిలో ఉత్పాదక సామర్ధ్యం వినియోగంలోకి వస్తుందని వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ప్రాతిపదికనే వారి సిద్ధాంతాన్ని రూపొందించారు. ప్రతీ దేశమూ తనకు ఏ యే రకాల సరుకుల ఉత్పత్తిలో ప్రత్యేక నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం కూడా పూర్తి స్థాయిలో వినియోగించబడుతుందని వీళ్ళు ఊహించుకుంటారు. ఆ పరిస్థితిలో మొత్తంగా అన్ని దేశాలనూ కలిపి చూసుకుంటే ప్రపంచ ఉత్పత్తి పెరుగుతుంది. అందువలన వాణిజ్యంలో భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూరుతుందని, ఒక వేళ ఏ కారణంవల్లనైనా ఒక దేశానికి ప్రయోజనం కలగకపోయినా, నష్టం మాత్రం కలగదని వారంటారు.
           ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలూ (పూర్తి స్థాయిలో ఉపాధి, పూర్తి స్థాపక సామర్ధ్యం మేరకు ఉత్పత్తి, వగైరా) అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే ముందుగాని, ఆ తర్వాతగాని గరిష్ట స్థాయిలో అమలులోకి రావడం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో జరగనే జరగదు. ఈ సంగతి స్వయంగా ఉదారవాద బూర్జువా ఆర్థికవేత్త అయిన జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ జరిగే ఉత్పత్తికి సరితూగే స్థాయిలో డిమాండ్‌ ఉండదని, అందుకే ఆ వ్యవస్థ నిరంతరం అధికోత్పత్తి సమస్యను ఎదుర్కొంటూ వుంటుందని ఆయన అన్నాడు. అందువలన ఇతర దేశాలతో వాణిజ్యం అంటే తన వాణిజ్య భాగస్వామి దేశానికి తన నిరుద్యోగాన్ని ఎగుమతి చేయడమే అని వ్యాఖ్యానించాడు. అంటే భాగస్వామి దేశం నుండి తెచ్చుకునే దిగమతులకన్నా, ఆ దేశానికి చేసే ఎగుమతుల విలువ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. తన దేశంలో డిమాండ్‌ కు ఎంత ఎక్కువ మోతాదులో కొరత ఉంటే, అంత మేరకు నిరుద్యోగం పెరుగుతుంది. దానిని తగ్గించాలంటే అంత ఎక్కువ మోతాదులో విదేశీ వాణిజ్యంలో మిగులు ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు తన భాగస్వామి దేశానికి ఎగుమతి చేయడానికి అవసరమైన సరుకులను ఉత్పత్తి చేయడానికి తన దేశంలో ఉపాధి కల్పించడానికి వీలౌతుంది. ఇక్కడ ఉపాధి పెరిగిన సమయంలోనే ఆ భాగస్వామి దేశంలో ఆ మేరకు అదనంగా నిరుద్యోగం పెరుగుతుంది. ఒకవేళ ఆ భాగస్వామి దేశం పెట్టుబడిదారీ వ్యవస్థలో లేకపోయినా, అక్కడికి కూడా నిరుద్యోగం ఎగుమతి అవుతుంది.
            సరుకులు, సేవలు, పెట్టుబడులు (ద్రవ్య పెట్టుబడులతో సహా) సాపేక్షంగా నిరాటంకంగా దేశాల హద్దులను దాటి తరలించగలగడం నయా ఉదారవాద వ్యవస్థ ప్రధాన లక్షణం. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు భాగస్వామ్య దేశాలన్నింటికీ ప్రయోజనకరంగా ఉంటాయన్న బూర్జువా వర్గ వాదనను ముందుకు తెచ్చింది ఈ నయా ఉదారవాద వ్యవస్థను నెలకొల్పడానికే. కాని అమెరికాలో హౌసింగ్‌ బుడగ ఒక్కసారి పేలిపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధికోత్పత్తి సంక్షోభంలో దీర్ఘకాలం పాటు మునిగిపోయింది. అప్పటి నుంచీ ఇతర దేశాల దిగుమతుల తాకిడి నుండి తన దేశాన్ని కాపాడుకునే చర్యలు చేపట్టే ప్రహసనం మొదలైంది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే బదులు ఆ సరుకులను స్వదేశంలోనే ఉత్పత్తి చేయాలన్న ఆలోచన ముందుకొచ్చింది. అప్పుడు స్వదేశంలో ఉద్యోగాల కల్పన పెరుగుతుంది, అంటే దాని ఫలితంగా తక్కిన దేశాలలో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది నిరుద్యోగాన్ని ఎగుమతి చేయడమే. మూడవ ప్రపంచ దేశాలు రక్షణ విధానాలను విడిచిపెట్టి నయా ఉదారవాద విధానాలను అనుసరించాలని ముందు ఒత్తిడి తెచ్చినది సంపన్న పెట్టుబడిదారీ దేశాలు. అవే దేశాలు ఇప్పుడు తమ తమ దేశాల్లో రక్షణ విధానాలను అమలు చేయడానికి పూనుకుంటున్నాయి. అంటే నయా ఉదారవాద వ్యవస్థ నియమాలను ఈ సంపన్న దేశాలే ఉల్లంఘిస్తున్నాయన్నమాట. ఈ దేశాలన్నీ ప్రత్యేకించి చైనాను తమ లక్ష్యంగా చేసుకున్నాయి. ఎగుమతులను పెంచడం ద్వారా అభివృద్ధి సాధించిన దేశంగా చైనా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇంతవరకూ చైనాలో పెట్టుబడులు పెట్టి అక్కడ చవకగా ఉత్పత్తి చేసిన సరుకులను తిరిగి తమ దేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చాయి ఈ సంపన్న దేశాలు.
         ఇప్పుడు అమెరికా చైనా నుండి దిగుమతులను తగ్గించే 'రక్షణ' విధానాలను అనుసరించడం చూస్తున్నాం. ఐతే ఈ విధంగా నయా ఉదారవాదపు 'స్వేచ్ఛా వ్యాపార' విధానాలకు భిన్నంగా వ్యవహరించడానికి కారణం అమెరికా చైనా పట్ల రాజకీయంగా అనుసరిస్తున్న శత్రు వైఖరి అని ఉదారవాద బూర్జువా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐతే అధికోత్పత్తి అనే ధోరణి పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఒక ధోరణిగా ఉన్నందువలన దాని ఫలితంగా వచ్చిన సంక్షోభం అమెరికాను, పశ్చిమ సంపన్న దేశాలను రక్షణ విధానాలను చేపట్టేలా చేసింది. అంతే తప్ప ఇదేదో కేవలం రాజకీయ శత్రుత్వం వల్ల కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు మొదటి నుండీ సంక్రమించిన జబ్బు (అధికోత్పత్తి) వలన ఆ దేశాలు చైనా పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని ఉదారవాద పండితులు ఎందుకు గుర్తించరు? పెట్టుబడిదారీ వ్యవస్థ స్వత:సిద్ధంగా లోపరహితం అని వారు భావించడమే కారణం. ఈ రాజకీయ శత్రుత్వమే గనుక లేకపోయినట్లైతే అంతర్జాతీయ వాణిజ్యం మూడు పువ్వులు-ఆరు కాయలుగా సాగిపోయేదని వారు వాదిస్తారు.
          దిగుమతులను తగ్గించి, ఎగుమతులను పెంచడం ద్వారా భాగస్వామ్య దేశాలకు తమ నుండి నిరుద్యోగాన్ని ఎగుమతి చేస్తూ తాము మాత్రం సంక్షోభం నుండి బైటపడాలని, ఈ క్రమంలో భాగస్వామ్య దేశం అడుక్కుతిన్నా తనకు అనవసరం అని అనుకునే ధోరణి 1930 దశకంలోని మహామాంద్యం కాలంలో బలంగా వ్యక్తం అయింది. ఆ కాలంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచి తద్వారా డిమాండ్‌ ను బాగా పెంచే ప్రయత్నాలను అప్పుడు ఎక్కడా చేయలేదు. ఒక్క ఫాసిస్టు దేశాలు మాత్రమే యుద్ధానికి సిద్ధం అవుతూ అందుకవసరమైన సన్నాహాలకోసం ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాయి. రూజ్‌వెల్ట్‌ ఆ 1930 దశకంలోనే 'న్యూ డీల్‌' ను ప్రతిపాదించాడు. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమే ఆ ప్రతిపాదన ముఖ్యాంశం. దాని ఫలితంగా అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభించింది కూడా. ఐతే ఆ వెంటనే న్యూ డీల్‌ను పక్కన పెట్టారు. దాని వలన తిరిగి సంక్షోభం మొదటికొచ్చింది. యుద్ధం ముంచుకొస్తోంది అని గుర్తించిన తర్వాతనే పెట్టుబడిదారీ దేశాలు తమ తమ ఆయుధాల నిల్వలను పెంచుకోవడం కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచాయి. కాని అంతవరకూ అంతర్జాతీయ వాణిజ్యంలో పోటీ పడి దిగుమతులను తగ్గించుకోవడం, మారకపు రేట్లను తగ్గించడం వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు. దాని వలన ఏ ఒక్క దేశంలోనూ సంక్షోభాన్ని తగ్గించుకోలేకపోయారు. ఐతే దిగుమతులకు బదులు స్వదేశంలోనే ఉత్పత్తి చేట్టాలన్న విధానం మూడో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా లాటిన్‌ అమెరికా దేశాల్లో అమలు చేసినందువలన అక్కడ పారిశ్రామికీకరణకు బీజాలు పడ్డాయి. సామ్రాజ్యవాద దేశాలలో తలెత్తిన సంక్షోభం మూడో ప్రపంచ దేశాల పారిశ్రామికీకరణకు దారి తీసింది.
ప్రస్తుతం మళ్ళీ చైనా ఎగుమతులకు కళ్ళెం వేయాలన్న పేరుతో సామ్రాజ్యవాద దేశాలు రక్షణ విధానాలను చేపడుతున్నాయి. దానిని సమర్ధించుకోడానికి రాజకీయ శత్రుత్వాన్ని సాకుగా చూపుతున్నాయి. కాని వాస్తవానికి రక్షణ విధానాల ద్వారా చైనాకు నిరుద్యోగాన్ని ఎగుమతి చేయాలన్నదే వాటి ఉద్దేశ్యం.
            ఐతే దీని వలన చైనా దెబ్బ తినిపోతుందనుకోలేం. గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఎగుమతులను పెంచుకోడానికి బదులు, దేశీయంగా వినియోగాన్ని పెంచడం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. దానివలన అటు సామ్రాజ్యవాదుల ఎత్తుగడలను తిప్పికొట్టవచ్చు, పైగా దేశీయంగా రైతాంగపు అభిమానాన్ని తిరిగి పొందవచ్చు. నిజానికి కొద్ది సంవత్సరాల క్రితమే చైనా ''సోషలిస్టు గ్రామీణ ప్రాంతాల దిశగా'' అన్న డాక్యుమెంట్‌ను ఆమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యయాన్ని మరింత ఎక్కువగా పెంచడం ఆ డాక్యుమెంట్‌ సారాంశం.
ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే ప్రస్తుత పరిస్థితులలో ఎగుమతులను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాలన్న వ్యూహంలో ఉన్న లోటుపాట్లేమిటో తెలుస్తోంది. ఏదైనా ఒక దేశం, అందునా, ఒక పెద్ద దేశం ఎగుమతులను పెంచడం ద్వారా అధిక వృద్ధిరేటును సాధించాలన్న వ్యూహాన్ని అనుసరిస్తే, ఆ దేశం మీద సామ్రాజ్యవాద దేశాలు కన్నెర్ర చేస్తాయి. అధికోత్పత్తి సమస్య ఉన్నా, లేకపోయినా, ఒక మూడవ ప్రపంచ దేశం గనుక ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకుంటే సామ్రాజ్యవాద దేశాల నుండి ప్రతి చర్యలు తప్పవు.
            చైనా కంటె ముందు జపాన్‌ విషయంలో ఇదే జరిగింది. జపాన్‌ ఏ విధంగా చూసినా, సామ్రాజ్యవాదులకు శత్రు దేశం కానే కాదు. కాని ఆ దేశం అమెరికాతో చేసిన వ్యాపారంలో ఎగుమతులను పెంచగానే, అమెరికా జపాన్‌ పట్ల రక్షణ వ్యూహాన్ని అమలు చేసింది. దాని ఫలితంగా జపాన్‌ వృద్ధి ఒక్కసారి పడిపోయింది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా అనుసరిస్తున్న విధానం జర్మనీ ఎగుమతులలో సాధిస్తున్న వృద్ధిని దెబ్బ తీయడానికి కూడా తోడ్పడుతుంది. రష్యా నుండి చౌకగా చమురు, సహజ వాయువులను రవాణా చేసే నార్డ్‌ స్ట్రీం పైప్‌లైన్‌ను యుద్ధం సాకుతో పేల్చివేశారు. దాని వలన జర్మనీ చౌకగా రష్యా నుండి చమురు, సహజ వాయువులను పొందలేని పరిస్థితి వచ్చింది. ఫలితంగా జర్మనీలో ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయింది. ఇక సమీప భవిష్యత్తులో జర్మనీ తన ఎగుమతులను పెంచుకుని తద్వారా వృద్ధి సాధించే అవకాశాలు లేకుండా పోయాయి.
కేవలం దిగుమతులను తగ్గించుకున్నంత మాత్రాన ఒకానొక దేశం వృద్ధి రేటును పెంచుకోజాలదు. దిగుమతులు తగ్గిస్తే, దాని ఫలితంగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాని అది ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఆర్థిక వృద్ధిరేటును నిత్యం పెంచుకోవాలంటే దానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ఒక్కటే మార్గం. ద్రవ్యలోటును పెంచడం ద్వారా అయినా లేక పన్నుల ఆదాయాన్ని పెంచడం ద్వారా అయినా ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. కాని అందుకు నయా ఉదారవాద విధానాలు అనుమతించవు. ప్రస్తుత సంక్షోభం నుండి తన దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రధాన సామ్రాజ్యవాద దేశం అమెరికా, రక్షణ విధానాన్ని అనుసరించడం వరకే పరిమితం అయితే సరిపోదు. అంతకన్నా చాలా ఎక్కువ ప్రయత్నం అవసరం.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

prabhat