
'ఏరా బాబూ..ఎలా ఉన్నావ్..?' అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే గొంతు మూగబోయి 17 సంవత్సరాలయింది. కొరటాలగా అందరూ ప్రేమగా పిలుచుకునే కా|| కొరటాల సత్యనారాయణ జన్మించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయింది. 1923 సెప్టెంబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో బుచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనైనా పెరిగింది ప్రజల మధ్య. పని చేసింది శ్రామిక జనం కోసం. హైస్కూలులోనే డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా 11 రోజుల విద్యార్థుల సమ్మెకు నాయకత్వం వహించారు. గుంటూరు ఎ.సి కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరి మధ్యలోనే చదువు ఆపేసి ప్రజా ఉద్యమాలకు తన యావత్ జీవితాన్ని అంకితం చేశారు. నాటి నుండి ఆఖరి శ్వాస వరకు మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతంపై అత్యంత విశ్వాసంతో ఉంటూ కమ్యూనిస్టు పార్టీలో-తొలుత ఉమ్మడి సిపిఐ తరువాత సిపిఐ(యం)లో) పనిచేశారు. 1946-48 మధ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో దానికి మద్దతుగా నిలబడి జైలుపాలయ్యారు. 1948లో అరెస్టయి కడలూరు జైలులో గడిపారు. గుంటూరు జిల్లాలో బంజరు భూములు, లంక భూముల కోసం పేదలను కదిలించి పోరాటాలు నిర్వహించారు. వ్యవసాయ కూలీల వేతనాల పెంపు కోసం పోరాడారు. పాలేర్ల పోరాటానికి అండగా నిలబడ్డారు. రేపల్లె ప్రాంతంలో చేనేత కార్మిక సంఘాన్ని నిర్మించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ తరువాత రైతుసంఘం కార్యదర్శిగా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పత్తి రైతుల ఆత్మహత్యల్ని వెలికితీసి వాటిపై ఆనాటి ఎన్టి రామారావు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేందుకు కారణమయ్యారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ వ్యవస్థాపక చైర్మన్గా దాని అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1952 తొలి పార్లమెంటు ఎన్నికలలో అతి చిన్న వయస్సులోనే తెనాలి లోక్సభ నుండి పోటీ చేసి కేవలం 1100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1962లో మొదటిసారి వేమూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలో ఆయన కూడా ఉన్నారు. రెండవసారి 1978లో రేపల్లె నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. తెనాలి- రేపల్లె ప్రాతంలో ఆయన సాగించిన ప్రజా ఉద్యమాలు, ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వడానికి తోడ్పడ్డాయి. పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 1991-97 మధ్య పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2002-05 మధ్య పొలిట్బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
నాకు ఆయనతో 1984 నుండి ప్రత్యక్ష పరిచయం. అంతకు ముందు ఆయన గురించి వినడం, దూరం నుండి చూడడం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. 1983 శాసనసభ ఎన్నికలు అయిపోగానే నేను డివైఎఫ్ఐ రాష్ట్ర బాధ్యతల్లోకి వచ్చాను. యువజన, విద్యార్థి ఉద్యమాన్ని ఆయనే పార్టీ నుండి గైడ్ చేసేవారు. ఆ తరువాత నేను రైతు సంఘంలోకి మారినప్పటి నుండి కూడా ఆ బంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆయన పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాక ఆయన స్థానంలో రైతుసంఘం బాధ్యతలు నేను తీసుకున్నాను. ఆ తరువాత ప్రజాశక్తి సంపాదకునిగా బాధ్యతల్లో చేరాక ఆయనే ఆ సంస్థకు చైర్మన్గా ఉండేవారు. నేను ఢిల్లీ అఖిల భారత కేంద్రానికి వెళ్లడానికి కూడా ఆయన ప్రోత్సాహమే కారణం. ఆ రకంగా రెండు దశాబ్దాలకు పైగా ఆయనతో ప్రత్యక్షంగా ఆయన గైడెన్సులో పనిచేశాను. ఎన్నో అపూర్వమైన అనుభవాలను, మంచి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోయారు.
కా|| కొరటాల శత జయంతి సందర్భంగా ఆయన నుండి ఎన్నో అనుభవాలు నేర్చుకోవచ్చు. ఆయన నిరంతర అధ్యయనశీలి. యువజన సంఘంలో రాష్ట్ర యువజనోత్సవాలు నిర్వహించేందుకు అనుభవం లేని మానెత్తిమీద పెద్ద భారాన్ని వేసుకున్నాము. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు నిర్వహించిన కార్యకలాపాలను విడమరిచి చెప్పి మీరు ఖచ్చితంగా నిర్వహించగలరు అన్న ధైర్యాన్ని ఇచ్చారు. యువజనోత్సవాల నిర్వహణకు ప్రతి సూక్ష్మమైన వివరాన్ని ఆయనతో చర్చించాకే తుది రూపం ఇచ్చేవాణ్ణి. ఈ అనుభవంతో రెండో యువజనోత్సవాలను వరంగల్లో నిర్వహించాం. యువజన సంఘం స్వతంత్రంగా నిధులు పోగేసుకొని నడపడానికి ఆయనిచ్చిన ప్రోత్సాహమే కారణం. అఖిల భారత కిసాన్ మహాసభ ఖమ్మంలో జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం మీద వేలాదిమంది ఎర్ర చొక్కా వలంటీర్లకు శిక్షణనిచ్చి కవాతు నిర్వహించాం. అందులో 3,500 మందికి 10 రోజులపాటు క్యాంపు నిర్వహించి వివిధ జిల్లాల్లో శిక్షణ ఇచ్చాము. యువ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి అనకాపల్లిలో 10 రోజులపాటు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాము. యువజన సంఘం జిల్లా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఈ క్యాంపు ఎంతగానో తోడ్పడింది. వీటన్నింటి వెనక ఉన్నది కొరటాల మార్గదర్శకత్వం.
నేను యువజన సంఘం నుండి పాక్షికంగా రిలీవ్ అయి రెండు సంవత్సరాలపాటు రైతు రంగంలో ప్రత్యక్షంగా పనిచేశాను. ఈ కాలంలో వ్యవసాయ రంగంలో అనేక క్లిష్టమైన సమస్యలను అధ్యయనం చేయడానికి కా|| కొరటాల నన్ను వెంటబెట్టుకొని తిప్పారు. అప్పుడప్పుడే మొదలువుతున్న రొయ్యల సాగులో అనేక మెళకువలు నేర్చుకోవడానికి రొయ్యల సాగు వలన వచ్చే పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఆయనతో జరిపిన చర్చలు తోడ్పడ్డాయి. పేద రైతుల పునాదిగా రైతు ఉద్యమాన్ని నిర్వహించాలన్న పార్టీ డైరెక్షన్కు అనుగుణంగా రైతు సంఘాన్ని కొత్త ఒరవడిలో నడపాలని నిర్ణయించుకున్నాం. రేపల్లె-తెనాలి ప్రాంతాలను సందర్శించి పేద రైతుల సమస్యలను ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ఆయన తోడ్పడ్డారు. వస్తున్న మార్పులను ఆయన నిశితంగా పరిశీలించేవారు. ఆ చర్చల్లో నుండే కౌలు రైతులను ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. రైతు సంఘంలో అంతర్భాగంగానే కౌలు సంఘాన్ని ప్రారంభించాము. ఆ తరువాత అది స్వతంత్ర సంఘంగా మారి తన కాళ్ళపై తను నిలబడి పని చేస్తున్నది. వ్యవసాయ రంగంలో అత్యంత క్లిష్టమైన సమస్య నీటిపారుదల రంగం. సుందరయ్య రాసిన 'ఆంధ్రప్రదేశములో సమగ్ర నీటి పథకం' పుస్తకం చదివినా అర్థమైందని చెప్పలేను. నేను చదివిన ప్రతి అంశాన్ని కొరటాలతో చర్చించిన తరువాతే నాకు బోధపడేది. కొల్లేరు సమస్య ఆరోజు వివాదాస్పదంగా ఉండేది. సుందరయ్య గారు కొన్ని శాస్త్రీయ పరిష్కారాలు చూపారు. వాటిని భూస్వాములు ఆమోదించలేదు. కొరటాలతో కలిసి పడవల మీద కొల్లేరు సందర్శించి పరిశీలించాము. ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ దీన్నొక ముఖ్య సమస్యగా స్వీకరించి ప్రజల్ని సమీకరించి ఉద్యమాన్ని నడిపింది. పేద రైతులు, వృత్తిదారుల సంరక్షణను మేము ప్రధానంగా ముందుకు తీసుకొచ్చాము. నూతన ఆర్థిక విధానాలు అమలయ్యాక తొలి దశలో ఆత్మహత్మలు మొదలయ్యాయి. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను కా|| కొరటాల పరామర్శించి దానికి కారణాలను శోధించారు. కొంతమంది జడ్జిలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా కమిటీ నియమించి అధ్యయన నివేదికను వెల్లడించారు. ప్రత్యామ్నాయ నినాదాలతో మన రైతుసంఘం, పార్టీ దీన్నొక ఎజెండాగా మార్చగలిగాయి. నాటి కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలు రైతు ఆత్మహత్యలను గుర్తించడానికి నిరాకరించాయి. అప్పటికే చేనేత కార్మికుల ఆకలి చావుల మీద, మహబూబ్నగర్ జిల్లా కరువు చావుల మీద ఆయన లోతుగా అధ్యయనం చేసి ఉద్యమాలు నడిపి ఉన్నారు. ఈ ఆత్మహత్యలకు నూతన ఆర్థిక విధానాలకు మధ్య ఉన్న సంబంధాన్ని మేము రైతుల్లో ప్రచారం చేయడానికి రైతు రక్షణ యాత్రను చేపట్టాం. హైదరాబాద్లో పెద్ద సభ కూడా జరిగింది. రైతు రంగంలో ఉద్యమ కార్యకర్తలను పెంచుకోడానికి, ఉన్నవారిని చురుగ్గా పని చేయించడానికి ఉయ్యూరులో ప్రత్యేకంగా నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఆయన సలహామీదే సిలబస్ రూపొందించాం. పంటలవారీ సమస్యలు, సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీలు, చెరకు ధర నిర్ణయించే తీరు ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవే. ఈ క్రమంలోనే గొర్రెల మేకల పెంపకందార్ల సమస్య మా ముందుకొచ్చింది. కొరటాల సలహాతో రైతుసంఘం చొరవ తీసుకొని మేమే దానికి ఆర్థిక సహకారం కూడా అందించి సంఘాన్ని నిర్మించాము. అది కూడా ఇప్పుడు స్వతంత్ర సంఘంగా పని చేస్తున్నది.
కార్యకర్తల పట్ల ఆయన అభిమానం ఎనలేనిది. ఆయన వయస్సు పెద్దదీ. సీనియర్ కమ్యూనిస్టు. ఆయినా జూనియర్లతోనూ, యువతీ యువకులతోనూ కలిసి పోయేవారు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమాత్రం జంకు ఉండేది కాదు. స్వేచ్ఛగా చర్చించడానికి అవకాశం ఇచ్చేవారు. విడమరిచి చెప్పేవారు. సమస్య వస్తే పరిష్కారానికి తోడ్పడేవారు. క్షేత్రస్థాయి వరకు శాఖా సమావేశాలకు వెళ్ళమని ప్రోత్సహించేవారు. ఆయన క్షేత్రస్థాయి నుండి పైకి ఎదిగివచ్చిన నాయకుడు. మాలాంటి వాళ్ళను క్షేత్రస్థాయికి పంపి పై నాయకత్వానికి అవసరమైన అర్హతలు సాధించేందుకు తోడ్పడ్డారు. ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అతి అంచనాలకు పోకుండా వాస్తవిక దృక్పథంతో వ్యవహరించేందుకు, ఆచరణాత్మక సమస్యలను ఎదుర్కొని పరిష్కరించేందుకు, అన్నిటినీ మించి వైఫల్యాలు ఎదురైనప్పుడు దైర్యం చెప్పేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు ఆయనతో రోజులతరబడి జరిపిన సుదీర్ఘ చర్చలు ఇప్పటికీ జ్ఞాపకమున్నాయి. కేంద్ర కమిటీ తీర్మానాలను విడమరిచి చెప్పేవారు. పార్టీపై విశ్వాసాన్ని పునరుద్ధరించుకునే ఒక చారిత్రక మూల మలుపులో ఈ అధ్యయనం, చర్చలు నన్ను నేను నిలబెట్టుకునేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి.
నేను ప్రజాశక్తికి మారడానికి కూడా ఆయన ప్రోత్సాహమే కారణం. అప్పటి వరకు నాకు పత్రికా రంగంలో ఎటువంటి అనుభవం లేదు. యువజన, రైతు సంఘాలలో మాస పత్రికలు నేనే నడిపేవాణ్ణి. అవి లాభదాయకంగా కూడా నడిచాయి. రైతు ఉద్యమ పోషణకు కూడా రైతువాణి తోడ్పడేది. కొరటాల రైతుసంఘం కార్యదర్శిగా రిలీవ్ అయి నేను రైతుసంఘం బాధ్యతలు తీసుకునే మధ్యకాలంలో రైతువాణి బాధ్యతలు చేపట్టాను. ఇది మినహా నాకు వేరే అనుభవం లేదు. అయినా ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో కా|| మోటూరు హనుమంతరావు వృద్ధాప్యం దృష్ట్యా మరో ప్రత్యామ్నాయం కోసం పార్టీ పరిశీలిస్తున్న సమయంలో కొరటాల నా పేరు సూచించారు. మొదట్లో నాకు ఇష్టం లేకపోయినా ఆయనిచ్చిన విశ్వాసంతోనే బాధ్యతలు స్వీకరించాను. సంపాదకుడిగా పనిచేసిన ఐదేళ్ళ కాలంలోనే ఎన్నో ప్రయోగాలు చేశాము. వాటన్నింటి వెనక కా|| కొరటాల ప్రోత్సాహం, మద్దతు ప్రధానమైన కారణం. 2005 చివర్లో నేను ఢిల్లీకి మకాం మార్చిన తరువాత కూడా ఆయనతో వ్యక్తిగత సంబంధాలు కొనసాగాయి. తర్వాత అనతికాలంలోనే ఆయన చనిపోవడం అత్యంత బాధాకరం. ఆయన శతజయంతి సందర్భంగా జ్ఞాపకాలు నెమరువేసుకొని విప్లవోద్యమానికి అంకితమై పని చేసేందుకు ఆయన స్ఫూర్తి ఈ తరానికి ఎంతగానో తోడ్పడుతుంది.
వ్యాసకర్త - వి. శ్రీనివాసరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి